పుష్కర ఘాట్ల నిర్మాణంలో అవినీతి: నలుగురిపై: ఐఎఎస్ అధికారితో విచారణకు
అమరావతి: తెలుగుదేశం పార్టీ హయాంలో కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న అవినీతిపై విచారణ చేపట్టడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఐఎఎస్ అధికారిని నియమించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జల వనరుల శాఖకు చెందిన నలుగురు అధికారులపై చర్యలను తీసుకోవడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ బాధ్యతను కూడా ఐఎఎస్ అధికారికి అప్పగించింది. దీనిపై సాధారణ పరిపాలన విభాగం పరిధిలోకి వచ్చే కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడు ఆర్పీ సిసోడియాను నియమించింది.
ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లుగా తన నివేదికను అందజేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టింది. విజయవాడలో కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్, దుర్గా ఘాట్, పవిత్ర సంగమం ఘాట్లను నిర్మించింది. విజయవాడ పరిధిలో పద్మావతి, కృష్ణవేణి, దుర్గా, భవానీ, ఫెర్రీ, పవిత్ర సంగమం వద్ద మహా స్నాన ఘట్టాలను నిర్మించారు. ఒక్క ఘాట్ 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఉంది.
మొత్తం 8 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేశారు. అప్పట్లో నామినేషన్ల పద్ధతిన కాంట్రాక్టు పనులను అప్పగించారని, కోట్లాది రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయిదు లక్షల రూపాయల లోపు పనులను నామినేషన్ల పద్ధతిన కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. ఆ నిబంధనలను కాదని హడావుడిగా పనులను మంజూరు చేశారనే ఆరోపణలు, విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున చెలరేగాయి.
వాటిని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే ఓ దఫా దర్యాప్తు చేపట్టారు అధికారులు. నలుగురు అధికారులను ప్రాథమికంగా గుర్తించారు. రిటర్డ్ చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ సుగుణాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీఎస్ఎస్ రవిబాబు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎం వెంకటేశ్వర్లుపై తీసుకోవాల్సిన చర్యలను ఫ్రేమ్ చేయడానికి సిసోడియాను నియమించారు. దీనిపై విచారణ బాధ్యతలను తీసుకున్న రెండు నెలల వ్యవధిలో ఆర్పీ సిసోడియా తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వ తదుపరి చర్యలు ఉండొచ్చని సమాచారం