లీగల్ ఫైట్కు ఏపీ సర్కార్ రెడీ: ఢిల్లీ నుంచి న్యాయకోవిదులు..కోట్లాది నిధులు
అమరావతి: మూడు రాష్ట్రాల రాజధానులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
హైకోర్టులో దాఖలైన పిటిషన్లు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల కాన్సెప్ట్ రచ్చ చేస్తోంది. ఇటు రాజధాని అమరావతి రైతులు గత కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతుండగా మరోవైపు అమరావతి రాజధాని జేఏసీ బంద్కు పిలపునిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా గత ప్రభుత్వం ప్రకటించినట్లుగానే అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగేలా రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తూ జగన్ సర్కార్ అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం సరికాదని చెబుతూ మధ్యంతర స్టే ఇవ్వాలంటూ బుధవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇక పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ
ఇక ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఇందుకోసం రూ.ఐదు కోట్లు చెల్లించనున్నట్లు జీవోను విడుదల చేసింది. అయితే ముందుగా రూ. కోటి ఫీజుగా కింద విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. రాజ్యాంగ వ్యవస్థపై మంచి పట్టున్న ముకుల్ రోహత్గీని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారని జీవోలో పేర్కొంది. ఇందుకోసం మొత్తం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.
కోర్టులో అడ్వకేట్ అశోక్ భాను వాదనలు
ఇదిలా ఉంటే రాజధాని తరలింపుపై హెకోర్టులో వాదనలు జరిగాయి. రైతుల పిటిషన్ పై సీనియర్ అడ్వకేట్ అశోక్ భాను వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అణచివేసే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగా సూత్రాలకు విరుద్దంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తీసుకొచ్చారని చెప్పారు.ఇది మనీ బిల్లు కాదని ప్రభుత్వం కోర్టులో ఒప్పుకుందని చెప్పారు. రైతుల న్యాయబద్దమైన ఆకాంక్షలకు విఘాతం కలిగించే విధంగా బిల్లు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అశోక్ భాను. న్యాయ సమీక్ష విధానంలో సమాజహితానికి భంగం కలిగే విధానాలను అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని అన్నారు అశోక్ భాను.
మండలిలో వాడీ వేడీ చర్చ
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడురోజుల పాటు నిర్వహిస్తోంది. సోమవారం సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి సుదీర్ఘ చర్చ తర్వాత శాసనసభ ఆమోదం తెలిపింది. అయితే మండలిలో మాత్రం ప్రభుత్వంకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇక మండలిలో బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా మూడు నెలల పాటు అడ్డుకోవచ్చే వ్యూహంతో టీడీపీ వ్యవహరిస్తోంది.