అచ్చెన్న ఆరోగ్యంపై ఆందోళనకు చెక్: నలుగురు డాక్టర్లతో స్పెషల్ టీమ్: జీజీహెచ్కు మాజీమంత్రులు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచింది. ఆయన ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారంటూ భావిస్తోన్న ప్రభుత్వం.. ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలుస్తోంది. నలుగురు డాక్టర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించినట్లు చెబుతున్నారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, మెడికల్ బులెటిన్లను విడుదల చేసే బాధ్యతలను ఈ టీమ్కు అప్పగించినట్లు సమాచారం.
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. అరెస్టయిన రెండురోజుల నుంచీ ఆయన జీజీహెచ్లో డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. అరెస్టు కావడానికి ముందే ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారని, రోడ్డు మార్గం గుండా ఆయనను శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతికి తీసుకుని రావడం వల్ల ఆ గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఆయనను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.
ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను ఇటీవలే అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ విచారణ శనివారం నాటితో ముగిసింది. జీజీహెచ్లో.. ఆయన చికిత్స పొందుతోన్న గదిలోనే అచ్చెన్నను విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడితో అనుచితంగా ప్రవర్తించారని, ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలకు విరుద్దంగా తీర్పును కొనసాగించారంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అచ్చెన్న కుటుంబ సభ్యులు సైతం ఇదే తరహాలో ఆందోళనను వ్యక్తం చేశారు. దీనితో ప్రభుత్వం ఓ కమిటీని వేసినట్లు చెబుతున్నారు.
అందుకే-అచ్చెన్నాయుడి ఆరోగ్య విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నలుగురు డాక్టర్లతో ఓ కమిటీని నియమించినట్లు సమాచారం. ఇదిలావుండగా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద ప్రసాద్ జీజీహెచ్కు వెళ్లారు. అచ్చెన్నాయుడిని పరామర్శించారు. ఆయనకు అందుతోన్న వైద్యాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి బాగా లేదని అన్నారు. అయినకు త్వరలోనే బెయిల్ లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.