ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఎస్మా పరిధిలోకి వైద్యం, అత్యవసర సేవలు- ఉల్లంఘిస్తే శిక్షలే..
ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరునెలల పాటు వైద్యంతో పాటు రవాణా, మంచినీటి సరఫరా, అంబులెన్స్ సర్వీసులతో పాటు మరికొన్ని సేవలు ఎస్మా పరిధిలోకి వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో ఎస్మా ప్రయోగం..
ఏపీలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందితో పాటు ఇతర అత్యవసరశాఖల ఉద్యోగులు కూడా నిరంతరం శ్రమించాల్సిన పరిస్దితి. వీరిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా పరిధిలోకి వైద్యంతో పాటు మరికొన్ని సేవలను తీసుకొస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వచ్చే ఆరునెలల పాటు ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ ఎస్మా నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది.
ఎస్మా పరిధిలోకి వచ్చిన సేవలివే...
ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఎస్మా పరిధిలోకి పలు అత్యవసర సేవలను తీసుకొచ్చారు. వీటిలో అన్ని వైద్య సదుపాయలతో పాటు డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య పరికరాల కొనుగోలు సిబ్బంది, మందుల కొనుగోళ్లు, అమ్మకాలు, రవాణా, అంబులెన్స్ సేవలు, విద్యుత్, మంచినీటి సరఫరా, భద్రతా విభాగాలు, ఆహారం, మంచినీరు, బయోమెడికల్ వ్యర్ధాల నిర్వహణ కూడా ఎస్మా పరిధిలోకి వచ్చాయి.