అమరావతిలో ఆ భూ కేటాయింపులు రద్దు: వారు చెల్లించిన డబ్బు అంతే: ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన చర్చ సాగుతున్న సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రెండు ప్రముఖ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ కేటాయింపుల సమయంలో చేసుకున్న నిబంధనలు అమలు చేయకపోవటం..ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటు న్నట్లుగా పేర్కొంది.
అదే సమయంలో ఈ సంస్థలు ప్రభుత్వానికి భూ కేటాయింపుల నిమిత్తం చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, భూములు రద్దు చేస్తుండటంతో..తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆ సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి. అదే విధంగా రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపుల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఒప్పందాలను పరిశీలిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటనికి కొనసాగించాలని నిర్ణయించింది.
ఏపీలో ఆ ఉద్యోగుల సేవలు రద్దు: నెలాఖరులోగా తొలిగించండి: ప్రభుత్వ నిర్ణయం వెనుక..!
వైద్య సంస్థల భూముల రద్దు..
రాజధాని అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన భూ కేటాయింపులను సీఆర్డీఏ రద్దు చేసింది. ఇండో..యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ , బీఆర్ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టు లకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భూములు కేటాయించిన మూడేళ్లవుతున్నా కార్యకలపాలు ప్రారంభించకపోవటం.. నోటీసులిచ్చినా స్పందించకపోవటం..విక్రమ ఒప్పందాలను కుదుర్చుకోక పోవటం వలనే కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ రెండు సంస్థలు గడువులోగా పనులు ప్రారంభించలేదని.. అవి చెల్లించిన రూ 75 కోట్లు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు వాదిస్తున్నారు. అయితే, ఆ సంస్థలు మాత్రం తమకు కేటాయించిన భూములు రద్దు చేస్తుండటంతో..తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వానికి లేఖ రాసారు. దీని పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రద్దు ఎందుకంటే..
అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.6,500 కోట్లతో ముందుకొచ్చిన బీఆర్ షెట్టి సంస్థకు 2016 డిసెంబర్ 13న ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎనిమిది నెలల ప్రాజెక్టు శంకుస్థాపన చేసారు. అయితే, ప్రస్తుతం ఆ స్థలంలో బోరు తప్ప మరేమీ లేదని..సంస్థ ప్రతినిధులు మళ్లీ ఇటు చూడలేదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ఇండో..యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ ఆస్పత్రి భాగస్వామ్యంతో మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయాలతో ముందుకు వచ్చింది. ఈ సంస్థకు భూమి కేటాయిస్తూ 2016 జూలై 4 న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తొలి విడతలో 50 ఎకరాలు కేటాయించింది. రెండో విడతలో మరో 100 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కనీసం ఇటుక కూడా వేయకపోవటంతో నిర్ణయం తప్పలేదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.
ఇతర కేటాయింపుల పైనా సమీక్ష..
అదే విధంగా గత ప్రభుత్వ హాయంలో రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించి..ఇప్పటి వరకు ఒప్పందాల మేరకు నడుచుకోని సంస్థల విషయంలోనూ ప్రభుత్వం సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అనుయాయులకు భూములు కేటాయించారనేది వైసీపీ నేతల ఆరోపణ. అయితే, ప్రభుత్వంతో ఒప్పందం మేరకు భూములు తీసుకొని..ఒప్పందానికి కట్టుబడి ఉన్న సంస్థల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఒప్పందాలను ఉల్లంఘించి..కేవలం వ్యాపారాల కోసమే భూములు తీసుకున్న వారి విషయంలో మాత్రం సమీక్షలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ముందుగా నోటీసులు ఇవ్వటం..వారి స్పందనకు అనుగుణంగా చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.