ప్రకాశం బ్యారేజీ 60 వసంతాల వేడుకలు...డిసెంబర్ 29న
విజయవాడ: ఆంధ్రా వాసులకు పరిచయం అక్కర్లేని ప్రాజెక్టుల్లో ప్రకాశం బ్యారేజీ ఒకటి. కృష్ణా డెల్టా వాసుల సాగు,తాగునీటి అవసరాలను తీరుస్తున్నఈ అమూల్యమైన ప్రాజెక్ట్ నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 29న బ్యారేజీ దగ్గరలోని దుర్గాఘాట్లో ప్రత్యేక వేడుకల్నినిర్వహించనున్నట్లు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.
ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాల వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. బ్యారేజీకి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ప్రకాశం బ్యారేజీపై ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పకాశం బ్యారేజీ 60 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా నిలిచిందన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూర్తికావడానికి ఎంతో మంది ఇంజనీర్లు, అధికారులు విశేష కృషి చేశారన్నారు. మరో 50 ఏళ్లపాటు దీనికి ఎటువంటి ఢోకా ఉందన్నారు.
1857లో కెప్టెన్ చార్లెస్ ఓర్ నేపథ్యంలో సర్ ఆర్థర్ కాటన్ సారధ్యంలో రూ.1.75 కోట్లతో కృష్ణా ఆనకట్ట నిర్మాణంతో కృష్ణా డెల్టా ఏర్పడిందన్నారు. ఆనాటి నుంచి 1952 వరకూ నూరేళ్లపాటు కృష్ణా డెల్టాకు సాగునీరు, తాగునీరు అందించడంలో కృష్ణా ఆనకట్ట ప్రముఖ పాత్ర వహించిందన్నారు. ప్రాజెక్టుకు నిరంతరమూ మరమ్మతులు చేస్తూ భవిష్యత్తు తరాలకు ఈ ప్రాజెక్టును అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కు నీటి సరఫరా జరుగుతున్న విషయం మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.