ఏపీ ప్రభుత్వంలో సోమేశ్ కుమార్ కు పోస్టు ఖరారు..!?
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఏపీ ప్రభుత్వంలో కొత్త పోస్టింగ్ ఖరారైంది. హైకోర్టు ఆదేశాలతో సోమేశ్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి రిపోర్టు చేసిన సోమేశ్ ఆ తరువాత ఏపీ సీఎం జగన్ తోనూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కు ఏ పోస్టు ఇవ్వాలనే దాని పైన ఏపీ ప్రభుత్వంలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. కోర్టు ఆదేశాలను గౌరవించి తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసానని..పోస్టు గురించి చిన్నాదా పెద్దదా అనే ఆలోచన లేదని సోమేశ్ స్పష్టం చేసారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..పోస్టింగ్ ల పైన కసరత్తు చేసిన ఏపీ ప్రభుత్వం సోమేశ్ కు పోస్టు పైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కు కీలక పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఆయనకు ఏపీలో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పోస్టింగ్ ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్ మెంట్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాల క్రిష్ణ ద్వివేదికి వ్యవసాయ శాఖ అప్పగించాలని నిర్ణయించారు. మరో అధికారి రాజశేఖర్ కు పంచాయితీ రాజ్ శాఖ అప్పగించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. వీరితో పాటుగా మరి కొందరు సీనియర్ అధికారుల పోస్టింగ్ ల పైన ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఐఏఎస్ -ఐపీఎస్ అధికారుల విభజన జరిగింది. అందులో భాగంగా ఏపీకి కేటాయించిన సోమేశ్ కుమార్ క్యాట్ లో పిటీషన్ దాఖలు చేసి తెలంగాణలో కొనసాగారు. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో హైకోర్టు తీర్పు వచ్చింది. సోమేశ్ ను తెలంగాణ ఎలాట్ మెంట్ రద్దు చేస్తూ వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో, తెలంగాణలో రిలీవ్ అయిన సోమేశ్ ఏపీలో రిపోర్టు చేసారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సోమేశ్ సర్వీసులో కొనసాగనున్నారు. ఏపీలో రిపోర్టు చేసిన తరువాత పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టింగ్ లకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications