సచివాలయ పరీక్షలకు సర్వం సిద్దం : అభ్యర్ధులు ఏం చేయాలంటే : 21.69 లక్షల మంది పోటీ..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్ధులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. రికార్డు స్థాయిలో దాదాపు 21.69 లక్షల మంది అభ్యర్దులు పరీక్షలు రాయనున్నారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయటంతో పాటుగా అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసారు. పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అదే విధంగా అభ్యర్దులకు ప్రత్యేక సూచనలు చేసారు.
21.69 లక్షల మంది అభ్యర్దులు...
సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షల నిర్వహణకు సర్వం సిద్దం అయింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నారు. తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కానున్నారు. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నారు. అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని ... 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.
ప్రత్యేక బస్సులు..సహాయకులు నియామకం
ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేసారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా సమాచారం ఇచ్చారు. అదే విధంగా పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతించనున్నారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు. అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
అభ్యర్ధులకు ప్రత్యేక సూచనలు..
అభ్యర్థుల హాల్ టికెట్పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. ఇక, పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్పై వైట్నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు. సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు. జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు అని అధికారులు స్పష్టం చేసారు. ఏ అభ్యర్ధికి ఎటువంటి సాయం..సమాచారం కావాలంటే హెల్ప్ డెస్క్ ల ద్వారా పొందవచ్చని స్పష్టం చేసారు.