అచ్చెన్నాయుడి హత్యకు ప్రభుత్వం కుట్ర: కోర్టు ఆదేశాలు ధిక్కరణ, సోమిరెడ్డి, ఆలపాటి ఫైర్..
మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తోన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని మండిపడింది. ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని కోర్టు చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేసేందుకు ప్రయత్నించడం ఏంటీ అని అడిగారు.
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన లేఖ .. ఆ అక్రమాలు దర్యాఫు చెయ్యండి కానీ ..
వైద్యులపై ఒత్తిడి
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేతపై కక్షసాధింపు చర్యలు సరికాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. స్కాంలో ఏసీబీకి 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చిందని.. కానీ ఆస్పత్రిలోనే విచారించాలనే విషయాన్ని మాత్రం మరవడం ఏంటీ అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగాలేకున్నా.. వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చి డిశ్చార్జ్ చేయాలని అడగడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
రెండో సర్జరీ..
సర్జరీ అయిన రోజే ఇంటికి వెళ్లగా.. ఉదయాన్ని అరెస్ట్ చేసి 14 గంటలపాటు కారులో తిప్పి మానవ హక్కులను ఉల్లంఘించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తర్వాత మరోసారి ఆపరేషన్ చేయగా.. కోలుకుంటున్న ఆయనను బలవంతంగా డిశ్చార్జ్ చేయాలని కోరడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అచ్చెన్నాయుడు కాదు ఇతర నేతల విషయంలో ప్రభుత్వం అదే విధంగా ప్రవర్తిస్తుందని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.
హత్య చేసేందుకు కుట్ర.?
అచ్చెన్నాయుడిపై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. గాయం మానకున్నా డాక్టర్లతో తప్పుడు రిపోర్టులు రాయించడం ఏంటీ అని మండిపడ్డారు. అతనిని ఆస్పత్రిలోనే విచారించాలని కోర్టు చెప్పినా.. ఏసీబీ అధికారులు ఎందుకు చెవికి ఎక్కించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం కావాలనే వేధిస్తుందని ప్రజలకు కూడా అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ చర్యలతో అచ్చెన్నాయుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఈఎస్ఐ అక్రమాల్లో అచ్చెన్నాయుడుకి సంబంధం లేదు అని.. కానీ కుట్రతో అరెస్ట్ చేశారని విమర్శించారు.
Recommended Video
రూ.150 కోట్ల స్కాం
నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందని, అభియోగం మోపింది. ఇటీవల అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. అనారోగ్యం వల్ల జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. కేసు విచారించేందుకు కోర్టు ఏసీబీకి 3 రోజుల అనుమతి ఇవ్వడంతో.. డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.