ఏపీలో పంచాయతీ అఫీసులకు కొత్త రంగులు- కమిటీ ఏర్పాటు చేసిన జగన్ సర్కార్..
ఏపీలో పంచాయతీలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కొత్త రంగులను సూచించేందుకు జగన్ సర్కార్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వారం రోజుల్లోగా సూచించిన రంగులను ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు వేసేలా చర్యలు చేపట్టనుంది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై గతంలో హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రంగుల మార్పు..
గతేడాది జూన్ నెలలో ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే చేసిన మొట్టమెదటి పని పంచాయతీలకు రంగుల మార్పు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా అధికారులు ప్రభుత్వ పెద్దల మనసెరిగి పంచాయతీలకు వైసీపీ జెండా రంగులు వేసేలా మౌఖిక ఉత్తర్వులు ఇచ్చేశారు.
దీంతో పంచాయతీ కార్యాలయాలతో పాటు చిన్న చిన్న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ రంగులు కనిపించాయి. దీనిపై విపక్షాలతో పాటు పలువురు కోర్టుకెక్కడంతో హైకోర్టు తొలుత వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసినా ఫలితం లేకపోయింది.
సుప్రీం ఉత్తర్వులతో కొత్త రంగులు..
పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో కొత్తగా ఏ రంగులు వేయాలో ప్రభుత్వం నిర్ణయించుకోలేదు. దీనిపై ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారం రోజుల్లోగా కొత్త రంగులను సూచించాలని వారిని కోరింది. ఈ కమిటీలో భూపరిపాలనాశాఖ కమిషనర్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శిని సభ్యులుగా ఉంచారు. వీరు ఇతర రాష్ట్రాలతో పాటు మిగతా చోట్ల పంచాయతీ కార్యాలయాలకు ఏ రంగులు వేశారో పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలు చేయనున్నారు. వీటి ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.