ఏపీలో ఇక ఇంటర్లో గ్రేడ్ల రద్దు: గతంలో మాదిరి మార్కులు: ఎలా ఇవ్వాలి..!
ఏపీలో ఇంటర్ లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం రద్దు కానుంది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి తుది కసరత్తు చేస్తోంది. గ్రేడింగ్ విధానం కారణంగా ఇబ్బందులు వస్తుండటంతో విద్యార్దు లకు తిరిగి గతంలో మాదిరే మార్కులు ఇచ్చే ప్రతిపానకు ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. గ్రేడ్లు ఇచ్చిన కారణంగా ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్కు ఇబ్బందులు తలెత్తిన అంశం పైన ఇంటర్ విద్యామండలి..ప్రభుత్వం ఫోకస్ చేసాయి. అయితే, మార్కులు ఎలా ఇవ్వాలనేది దాని పైన ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అందు కోసం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల విధానాన్ని పరిశీలిస్తున్నారు.
గ్రేడింగ్ విధానంతో ఇబ్బందులు..
ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్ధులకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానం వలన తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్లో గ్రేడ్ల విధానాన్ని రద్దు దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో..గతంలో మాదిరే మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడింగ్ విధానం వల్ల ఇబ్బందులు వస్తున్న అంశాల పైన ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వంతో చర్చించారు. ఆ స్థానంలో మార్కులు ఇవ్వటమే ఉత్తమమని సూచించారు. దీనికి అంగీకరించిన ప్రభుత్వం..గ్రేడ్ల స్థానంలో విద్యార్థులకు మార్కులే ఇవ్వాల్సిందిగా సూచించింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ఇంటర్ విద్యా మండలి వెల్లడించనుంది. ఈ గ్రేడ్లతో మొదటి బ్యాచి బయటకు వచ్చింది. వీరికి మొదట గ్రేడ్లు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు, ఎంసెట్కు ఇబ్బందులు తలెత్తాయి.గత ఇబ్బందుల దృష్ట్యా గ్రేడ్ల విధానం ఇక కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేడ్ల విధానం ఎలా వచ్చిందంటే..
ఇంటర్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం రెండేళ్ల క్రితం గ్రేడ్ల విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఇందుకు మార్కులు అవసర మవుతున్నాయి. ఇదికాకుండా తెలంగాణ ఎంసెట్కు మార్కులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ ఏడాది దిల్లీ విశ్వవిద్యాలయం, కర్ణాటకలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాలు, పక్కరాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలకు మార్కులు అడగడంతో విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చారు. మొదట మార్కుల జాబితాలో గ్రేడ్, గ్రేడ్పాయింట్లు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలు మార్కులు అడుగుతున్నందున విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వచ్చాయి. దీంతో మార్కులను ఆన్లైన్లో ఉంచారు. ఆ తర్వాత మార్కుల జాబితాలోను మార్పులు చేయాల్సి వచ్చింది.
ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చర్చ..
ఈ పరిస్థితుల్లో విద్యార్ధుల గ్రేడ్ తో పాటుగా సబ్జెక్టుకు ఇచ్చే మార్కులు, విద్యార్థికి వచ్చిన మార్కులను వెల్లడించాల్సి వచ్చేది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఎదురువుతున్న ఇబ్బందుల నేపథ్యంలో గ్రేడ్లను రద్దు చేసి మార్కులు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే..ఇప్పుడు ఈ విధానం ఎలా అమలు చేయాలనే దాని పైన కసరత్తు చేస్తున్నారు. గతంలో మార్కులు ఇచ్చినప్పుడు మొత్తంగా ఒక గ్రేడ్ ఇచ్చేవారు. ఈసారి ప్రథమ.. ద్వితీయ.. తృతీయ శ్రేణులు ఇవ్వాలా అనే అంశం పైన చర్చ జరిగింది. ఇదే సమయంలో మొత్తం మార్కులను ఇచ్చి ఉత్తీర్ణత సాధించారని మాత్రమే ఇవ్వాలా.. అనే దానిపై ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇందు కోసం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల విధానాన్ని సైతం అధ్యయనం చేస్తున్నారు.