12నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు : స్పీకర్గా ఎవరో జగన్ ఖరారు చేసేసారు: డిప్యూటీ వారికే..!
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 నుండి అయిదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటుగా కొత్త స్పీకర్..డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్..ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్..విప్లను సైతం అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, స్పీకర్ పదవి ఎవరికి వరిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.
12 నుండి అసెంబ్లీ సమావేశాలు..
ఈనెల 12 నుండి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఈ నెల 12 నుండి అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అయిదు రోజుల సమావేశంలో తొలి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. కొత్తగా స్పీకర్..డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అదే విధంగా చివరి రోజు తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానంతోప ఆటుగా.. కేంద్రానికి సాయం కోరుతూ మరో తీర్మానం చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్..ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం నుండి చీఫ్ విప్..విప్లను ఖరారు చేయనున్నారు.
స్పీకర్గా జగన్ డిసైడ్ అయ్యారు..
ఏపీ నూతన స్పీకర్గా ఎవరికి అవకాశం ఇవ్వాలో జగన్ డిసైడ్ అయ్యారు. సభలో వైసీపీ బలం 151 కాగా..టీడీపీ బలం 23. దీంతో..జగన్ డిసైడ్ చేసిన వారే ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నిక కానున్నారు. జగన్ ఈ సారి ఉత్తరాంధ్ర నుండి స్పీకర్గా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. స్పీకర్గా ఆనం రామనారాయణ రెడ్డి లేదా రోజా పేర్లు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. అయితే, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా..శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనయర్ నేతలు ధర్మాన ప్రసాదరావు ..తమ్మినేని సీతారాం పేర్ల పైన దృష్టి సారించారు. అందులో ధర్మానకు స్పీకర్ గా అవకాశం ఇచ్చి..తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా గతంలో ప్రతిభా భారతి తరువాత శ్రీకాకుళం నుండి స్పీకర్గా పని చేసారు. ఇప్పుడు తిరిగి అదే జిల్లాకు స్పీకర్గా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది.
డిప్యూటీ స్పీకర్గా మహిళ..
ఇక, ఉత్తరాంధ్ర నుండి స్పీకర్ను ఎంపిక చేయాలని భావిస్తున్న జగన్..డిప్యూటీ స్పీకర్గా మహిళకు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి..అదే విధంగా రాయలసీమ నుండి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సైతం రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావటంతో..ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన మహిళకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా చిత్తూరులో 13 సీట్లు..అనంతపురం లో 12 సీట్లు వైసీపీ గెలుచుకుంది. దీంతో..ఈ ప్రాంతం నుండి మహిళకు అవకాశం ఇవ్వనున్నారు. రాయలసీమలోని బీసీ వర్గాలు మొత్తంగా వైసీసీకి అండగా నిలిచాయి. దీంతో..అక్కడి నుండి ఎస్సీ -ఎస్టీ లేదా బీసీ వర్గానికి చెందిన మహిళకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం దక్కనుంది. అందుకు అక్కడి నుండి ఎవరూ ఆసక్తి చూపకపోతే..ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈనెల 7న జరిగే పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.