ఏపీలో స్థానిక సంస్థల సమరం: 58.85 శాతం కోటా అమలుకు నిర్ణయం: ముహూర్తం ఖరారు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం అవుతోంది. హైకోర్టులో దాఖలైన పిల్ విచారణ సమయంలో ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అటు రాజకీయంగానూ ఈ ఎన్నికలకు అధికార పార్టీ సిద్దం అవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేపట్టింది. గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్న విధంగానే 59.85 శాతం కోటాను అమలు చేస్తామని..అందు కోసం కోర్టును ఒప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని పైన ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోనుంది.
పాత రిజర్వేషన్లు అమలు చేసేలా..
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ,బిసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85 శాతంకు పరిమితమైంది. అయితే రెండేళ్ళ కిందట సుప్రీం కోర్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతంకు మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిల రిజర్వేషన్ ను కుదించాల్సి వస్తుంది....ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం పాత రిజర్వేషన్ వర్తించ నుంది.
అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 59.85శాతం రిజర్వేషన్లతోనే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది. బిసిల పక్షపాతిగా ఉన్న తాము ఇప్పటికే బిసిల సామాజిక...ఆర్థిక సాధికారత కోసం పరిశ్రమల్లో ఉపాధి,అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్, ఆలయ పాలకమండాలల్లో బిసిలకు రిజర్వేషన్లు సిఎం జగన్ కల్పించారు. ఈ నేపథ్యంలో బిసిల్లో పట్టు మరింత పెంచుకునేందుకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కుదింపును వ్యతిరేకిస్తూ పాత రిజ్వర్వేషన్ విధానంలోనే ఎన్నికలకు సిద్ధమౌతోంది.
డిసెంబర్ లో ఎన్నికలకు అవకాశం..
రాష్ట్రంలోని 12వేల పైచిలుకు పంచాయితీల పదవీ కాలం 2018 ఆగస్టులో ముగిసింది. అలాగే ఎంపిపి, జెడ్పీ, మున్సిపాల్టీలకు ఈ ఏడాది జూన్ తో పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ దక్కే ఛాన్స్ ఉండదు.
దీంతో కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నకలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా పంచాయితీ రాజ్...మున్పిల్స్ శాఖలు వార్డుల విభజనతోపాటు...బిసి కుల గణననను పూర్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితాకు అనుగుణంగా ఈ గణనను పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల నాటి ఓటరు లిస్ట్ ప్రకారం డిసెంబర్ లోనే ఎన్నికలు నిర్వహిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కోర్టుకు సైతం ప్రభుత్వం మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పటంతో డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం..
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సమీక్షించారు. దీంతో పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బిసి జనాభా గణను పూర్తి చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్నిఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు గాలివాటం కాదని నిరూపించేలా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధించేలా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సవరణ జరగుతోంది. దీంతో కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే బిసి గణన తప్పనిసరి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు డిసంబర్ లో జరుగుతాయా...లేక మార్చిలో జరగుతాయా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.