జగన్ సర్కారు కీలక నిర్ణయం: ఆలయ అర్చకులకు ఒక్కొక్కరికి రూ. 5వేలు
అమరావతి: కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం 'అర్చక వెల్ఫేర్ ఫండ్' ద్వారా ఒక్కొక్కరికి రూ. 5వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు వివరాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వనరుల లేమితో అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వారిని ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లంపల్లి తెలిపారు.
చిన్న దేవాలయాల్లో అర్చకులకు ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక కేంద్రం విధించిన కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఏప్రిల్ 14 వరకు దేవాలయాల్లో భక్తులకు అనుమతి లేదని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అందువల్ల ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజలు చేస్తున్నారని తెలిపారు.
ఇదిఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో బుధవారం రాత్రి 9 నుంచి గురువారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారితో కరోనా కేసులు పెరిగాయి.
కాగా, గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. నరసారావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి టీబీ, నెమ్ము చికిత్స కోసం 10 రోజుల క్రితం ఐడీహెచ్ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతు రెండ్రోజుల క్రితం మృతి చెందాడు. అయితే, బాధితుడు మృతి చెందిన అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు స్థానిక ఆర్డీవో తెలిపారు.