గ్రామ వాలంటీర్లకు దసరా కానుక: పెరిగిన వేతనం ఎంతంటే..! నేడు సీఎం ప్రకటన..!
ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఆ వార్దు..గ్రామ వాలంటీర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు మొదలు పెట్టారు. అందులో బాగంగా వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం నుండి రూ 5 వేలు గౌరవ వేతనంగా అందుతుంది. అయితే.. వారి సమస్యలను..కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారి వేతనాల పెంపు పైన ఫోకస్ చేసింది. దీని పైన ముఖ్యమంత్రి జగన్ సైతం సానుకూలంగా ఉన్నారు.
దీంతో..ఆయన వారి పనితీరు గురించి అధికారులతో చర్చ చేసారు. ఇన్ని రకాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్న సమయంలో..వాలంటీర్లకు పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీంతో..వారికి దసరా కానుకగా ముఖ్యమంత్రి జగన్ వేతనాలను పెంచుతూ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం రూ 5 వేల నుండి రూ 8 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే..రూ 8 వేలుగా ఉంటుందా లేక ముఖ్యమంత్రి మరింతగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తి కరంగా మారింది. దీని పైన సీఎం అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు దాదాపు రెండున్నార లక్షల మందిని గ్రామ..వార్డు వాలంటీర్లుగా నియమించింది. గ్రామంలో ప్రతి దరఖాస్తును వలంటీర్లు పరిశీలించిన తర్వాత గ్రామ సచివాలయం ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామాల్లో వలంటీర్లు ప్రభు త్వ కార్యక్రమాల్లో కీలకం కానున్నారు. ప్రభుత్వం ప్రాథమికంగా వారికి రూ.5 వేల గౌరవవేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే వలంటీర్ల జాబ్చార్ట్ చూసిన తర్వాత రోజంతా చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఈ పోస్టుల్లో చేరేందు కు మొగ్గు చూపలేదు.
ఉన్నత చదువులు చదివి గ్రామాల్లో నిరంతరం ఈ సేవలో ఉండాలనుకునే వలంటీర్లకు రూ.5 వేల గౌరవవేతనం చాలదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారి పారితోషికం పై ఇటీవల ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. వారిచ్చిన నివేదిక మేరకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం రూ. 5 వేల నుండి రూ. 8వేలకు పెంచుతూ సిఫార్సు చేసారు. ఇదే సమయంలో వాలంటీర్లకు రూ 5 వేలు ఇవ్వటం పైనా రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. అయిదు వేలతో వారు ఉద్యోగాలు ఎలా చేస్తారనే ప్రశ్న మొదలైంది.
ఇక, వాలంటీర్లుగా చేరిన అనేక మంది సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో..గౌరవ వేతనం పెంచటం ద్వారానే లక్ష్యం నెరవేరుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీని పైన ముఖ్యమంత్రి అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.