ఆరోగ్యశ్రీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: వీరందరూ..అర్హులే: విధి విధానాలు విడుదల!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పధకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. వేయి రూపాయాలు దాటిని ప్రతీ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేసారు. ఇప్పటికే ఏపీలో అందని వైద్యం తమిళనాడు..కర్నాటక..తెలంగాణ కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఇదే సమయంలో డిసెంబర్ 21 నుండి వైయస్సార్ ఆరోగ్యశ్రీ ని పూర్తి స్థాయిలో అందించేందుకు అడుగులు వేస్తోంది. ఎవరు ఈ స్కీం కింద అర్హలనేది వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ..మార్గదర్శకాలు విడుదల చేసింది.
వైయస్సార్ మానస పుత్రికకు బ్రేక్ : ఏపీ లో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు...!!
5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి...
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వైయస్ఆర్ పెన్షన్ కానుక కార్డు..జగన్నన్న విద్యా .. వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా ఖరారు చేసారు. ఇక, మిగిలి వారిని గుర్తించేందుకు కొన్ని నిబంధనలను ప్రస్తావించారు. 5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలకు అర్హత కల్పించారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు..ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు గా ప్రభుత్వం ప్రకటించింది.
మాగాణి..మెట్ట భూములు ఉన్న వారికి..
ఇక, ఆరోగ్య పధకంలో అర్హులుగా భూములు ఉన్న వారికి కొన్ని నిబంధనలు ఖరారు చేసారు. అందులో.. 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి.. 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు గా గుర్తిస్తారు. తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. 3000 చదరపు అడగులు కంటే తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింప చేయాలని నిర్ణయించారు. అదే విధంగా.. కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు చేయాలని డిసైడ్ అయ్యారు. కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబర్ 21న పధకం ఆరంభం..
డిసెంబర్ 21 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ ఆరోగ్య శ్రీ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఆ తరువాత అన్ని జిల్లాలకు విస్తరిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ప్రతీ మండలానికి 104, 108 వాహనాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జూన్ నాటికి ప్రతీ మండలానికి అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక, వైయస్సార ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా వెయ్యి రూపాయాలు దాటిన ప్రతీ చికిత్సకు ఈ పధకం వర్తిస్తుంది. అదే విధంగా సర్జరీ చేయించుకుని..విశ్రాంతిలో ఉన్న వారికి సైతం రోజుకు రూ.125 చొప్పున ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.