నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!
ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పై విచారణ లేకుండా..ఏపి ప్రభుత్వ నివేదిక కోరకుండా నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంటలిజెన్స్ డిజికి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని..ఆయన పై చర్యలు ఏంటని టిడిపి నేతలు వాదిస్తున్నారు.
చంద్రబాబు అసంతృప్తి..
ఎన్నికల సంఘం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం పై టిడిపి అధినేత చంద్రబాబు..ఏపి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. వైసిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని..దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉం దని ఆరోపిస్తున్నారు. అసలు ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటలిజెన్స్ డిజి పై ఎలా చర్య తీసుకుంటారంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. నిఘా ఉన్నతాధికారులు రాష్ట్రంలో భద్రతా పరమైన అంశాల పైనే దృష్టి పెడతారని వారి కి ఎన్నికల తో సంబంధం ఉండదని వాదిస్తున్నారు. అదే విధంగా మిగిలిని ఇద్దరు ఎస్పీల వ్యవహారంలోనూ ఎన్నికల సంఘం కేవలం వైసిపి ఫిర్యాదు ను ఆధారం చేసుకొని చర్యలు తీసుకుందని చెబుతు న్నారు. ఎటుంటి విచారణ లేకుండా నివేదిక కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఫైర్ అవుతున్నారు.
కడప ఎస్పీ బదిలి .. సీయం అసంతృప్తి..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశలో ఉన్నప్పుడు కడప ఎస్పీ వేటుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వైపు వివేకా హత్య విచారణ జరుగుతుంటే..దేని ఆధారంగా కడప ఎస్పీ పై నిర్ణయం తీసుకున్నారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసు వ్యవహారాన్ని పక్క దోవ పట్టించేందుకే వైసిపి నేతలు కడప ఎస్పీ పై ఫిర్యా దు చేసారని..ఎన్నికల సంఘం ఏకపక్షంగా కడప ఎస్పీని బదిలీ చేసిందన్నది టిడిపి నేతల వాదన. కడప ఎస్పీ బది లీ వ్యవహారం పై ఉన్నతాధికారులతో సీయం మాట్లాడారు. ఈ నిర్ణయం సరి కాదంటూ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఎన్నికల సంఘం సంచలనం : నిఘా బాస్ పై వేటు : ఇద్దరు ఎస్పీల పైనా చర్యలు..!
హైకోర్టులో లంచ్ మోషన్..
ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పై అధికారులతో మాట్లాడిన తరువాత సీయం ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ను మూవ్ చేయాలని టెలికాన్ఫరెన్స్లో అధికారులకు సీఎం ఆదేశించారు. అయితే వైసిపి నేతలు మాత్రం తాము ఇంటలిజెన్స్ డిజి తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారనే దాని పై ఆధారాలు సైతం సమర్పించామని చెబుతున్నారు. తాము డిజిపి తో పాటుగా మరి కొందరు అధికారుల పైనా ఫిర్యాదులు చేసారు. వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణం అవుతోంది.