మందుబాబులకు షాక్: ఏపీలో బార్లు 40 శాతానికి తగ్గింపు: ధరలు పెంపు.. సమయం కుదింపు..!
ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకంది. ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించి..మద్యం ధరలను పెంచి..ఎక్సైజ్ సిబ్బందితో విక్రయాలు సాగిస్తున్న ప్రభుత్వం ..ఇప్పుడు బార్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
తొలుత సీఎం బార్లను 50 శాతం వరకు తగ్గించాలని సూచించినా...అధికారులు దశల వారీగా నిర్ణయాలు తీసుకుందామని చెప్పటంతో..40 శాతానికి నిర్ణయించారు. అదే విధంగా మద్యం దుకాణాలను 20 శాతానికి తగ్గించిన ప్రభుత్వం..విడతల వారీగా మిగిలిన వాటిని తగ్గించాలని నిర్ణయించింది. బార్లలో మద్యం సరఫరా వేళలను కుదిస్తూ నిర్ణయం తీసుకోగా..ధరల పెంపు పైనా సూత్ర ప్రాయంగా నిర్ణయం జరిగింది.
బార్లు 40 శాతానికి తగ్గింపు..
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మద్య నిషేధం దశల వారీ అమలు పైన సమీక్షించారు. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం జరిగింది. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని డిసైడ్ అయ్యారు. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం సూచించినా..అధికారులు నచ్చ చెప్పి మద్యం దుకాణాల తరహాలో దశల వారీగా తగ్గిద్దామని ప్రతిపాదించారు. అదే విధంగా బార్లలో మద్యం సరఫరా వేళలను కుదించాలని నిర్ణయించారు.
మద్యం సరఫరా ఉదయం 11 నుండి రాత్రి 10 వరకే..
బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ..రాత్రి 11 వరకూ ఆహారం అందించటానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. మద్యం కల్తీకు పాల్పడినా..స్మగ్లింగ్ చేసినా.. నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేసిన వారికి లైసెన్స్ ఫీజుకు మూడు రెట్లు జరిమానా...ఆరు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు తీసుకురావాలని సమావేశంలో డిసైడ్ అయ్యారు.
మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం..
ఇప్పటికే మద్యం దుకాణాల ద్వారా జరిగే కొన్ని బ్రాండ్ల అమ్మకాల ధరను ప్రభుత్వం కొంత మేర పెంచింది. ఇక, బార్లలోనూ మద్యం ధరలు పెంచే విధంగా చర్చ జరిగినా..పెంచాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హమీ మేరకు దశల వారీగా మద్య నిషేధం అమలు తీరు పైన సీఎం ఆరా తీసారు. ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠినంగా ఉండాలని అదనపు డీజీ సురేంద్ర బాబుకు సీఎం సూచించారు. దీంతో..ఏపీలో ఇప్పటి వరకు ఉన్న 798 బార్లు దాదాపు సగానికి తగ్గిపోనున్నాయి. దీంతో..మద్యం వ్యాపారులు తెలంగాణ మీద తమ భవిష్యత్ లిక్కర్ వ్యాపారాల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.