సామాన్యులకు బిగ్ రిలీఫ్... ఉల్లి ధరపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన...
లాక్ డౌన్ పీరియడ్లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సామాన్యులపై ఉల్లి ధర భారాన్ని తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో రాయితీపై కేవలం రూ.40కే కిలో ఉల్లిగడ్డలు అందించాలని నిర్ణయించింది. రేపటినుంచే రైతు బజార్లలో రాయితీపై ఉల్లిగడ్డలను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Recommended Video
పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారని కన్నబాబు చెప్పారు. దాదాపు 5వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే 1000 టన్నుల ఉల్లిని మార్కెట్లోకి తీసుకొచ్చి రైతు బజార్ల ద్వారా ప్రజలకు విక్రయిస్తామన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.40కి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ప్రతీ కుటుంబానికి ఒక కిలో నాణ్యమైన ఉల్లిగడ్డలను రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కర్నూలు సహా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడుల్లోనూ పంటలు దెబ్బతినడంతో ఉల్లి ధరలు పెరిగాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28వేల హెక్టార్లలో ఉల్లి సాగవుతోందని... మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు. అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.
సాధారణంగా ప్రతీ ఏటా ఈ సీజన్లో 12వేల క్వింటాళ్ల కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేదని... కానీ ఇప్పుడు కేవలం 1500 నుంచి 2వేల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వస్తోందని కన్నబాబు తెలిపారు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో రాష్ట్రానికి దిగుమతి తగ్గిందన్నారు.