ఆ శాఖలే అసలు టార్గెట్: ఏసీబీ చర్యలు..బలోపేతం దిశగా : ఐఐఎం సహకారంతో ఇలా..!
ఏపీలో అవినీతి రహిత పాలన అందిస్తానని పదే పదే చెబుుతున్న ముఖ్యమంత్రి జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఏపీలో అవినీతి కంపు కొడుతున్న ప్రధాన శాఖల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీని కోసం ఇప్పటికే అవినీతికి పాల్పడుతున్న వారి పైన దాడులు చేయాలని ఏసీబీకీ ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. అదనపు సిబ్బందిని సమకూర్చారు. అయిుదు నెలల కాలంలో రాజకీయంగా అవినీతి తగ్గినా..ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం అవినీతి పూర్తిగా తగ్గలేదని సీఎం అభిప్రాయపడుతున్నారు. దీంతో..అవినీతికి పాల్పడుతున్నవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే..అసలు అవినీతి ఉన్న శాఖల్లో ఇది ఎందుకు అలవాటుగా మారింది...చేపట్టాల్సిన చర్యలు ఏంటనే అంశం పైన అధ్యయానికి ఐఐఎం అహ్మదాబాద్ సహకారం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అవినీతిపై యుద్దం చేయాల్సిందే..
ఏపీలో తాను తొలి నుండి చెబుతున్న విధంగా అవినీతి పైన యుద్దం చేయటానికి ముఖ్యమంత్రి జగన్ సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఏసీబీ ద్వారా దాడులు చేయించటంతో పాటుగా.. అవినీతి మూలాలను తొలిగించాలని మంత్రులతో వ్యాఖ్యానించారు. అందులో భాగంగా.. అవినీతి పై పోరులో ఐఐఎం..అహ్మదాబాద్ సహకారం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి గల మూల కారణాలను ఐఐఎం నిపుణులు శోధించి ప్రభుత్వానికి నివేదిక అందించున్నారు. ఏపీలో ప్రధానంగా అవినీతికి ఆస్కారం ఉన్న శాఖలు..స్పందనలో భాగంగా ఇప్పటి వరకు ఫిర్యాదుల ఆధారంగా ఈ అధ్యయనం కొనసాగనుంది.
ఆ శాఖల పైన స్పెషల్ ఫోకస్..
ఏపీలో ప్రభుత్వ కీలక శాఖాలైన రెవెన్యూ కార్యాలయాలు.. మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం.. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..పోలీసు శాఖల్లో అవినీతి పైన ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీంతో..అసలు ప్రజలు ఈ శాఖల వద్దకు వచ్చి పని చేయించుకొనే విధానంలో మార్పులు తెచ్చి..పూర్తగా పారదర్శక విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీంతో..ఈ శాఖల్లో ప్రజలు ఎక్కడ అవినీతి ఎదుర్కోవాల్సి వస్తోందనే అంశం పైన అధ్యయనం చేసే బాధ్యత ఈ ఐఐఎం కు అప్పగించారు. ఈ సంస్థ క్షేత్ర స్థాయిలో ప్రజలతో పాటుగా..ఈ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు..అదే విధంగా ఏసీబీ అధికారుల సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను సిద్దం చేయనున్నారు.
దిద్దుబాటు చర్యల దిశగా..
ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అవినీతి రహిత పాలన దిశగా సంబంధిత శాఖల అధిపతులు..జిల్లాల్లో కలెక్టర్లు..ఎస్పీలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు. ఇక ముందుగా క్షేత్ర స్థాయిలో అవినీతి జరగకుండా తీసుకవాల్సిన చర్యలు ఐఐఎం సూచించనుంది. కారణాలు అన్వేషించి..చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏం తీసుకోవాలో సూచించనుంది. అదే సమయంలో ఏసీబీ ని అసవరమైతే మరింతగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సిద్దం అవుతోంది. దీంతో..రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి విధాన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.