సాయిరెడ్డికి ఇది అవమానమేనా: ప్రభుత్వ అవగాహన లోపమా: అనర్హత వేటు..టీడీపీ ఫిర్యాదు..!
వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి ఇది అవమానమేనా. ప్రభుత్వంలో అధికారుల అవగాహన లోపం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డి వైసీపీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాల కారణంగా సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియ మించాలని నిర్ణయించారు. అయితే, రాజ్యసభ సభ్యుడిగా లాభదాయక పదవిలో ఉన్న వ్యక్తికి ఆ పదవి ఇవ్వలేమనే విషయం పైన అధికారులు తప్పటడుగు వేసారు. ఫలితంగా విజయ సాయిరెడ్డికి ఒక రకంగా అవమానం తప్పలేదు. అదే సమయంలో టీడీపీ చేతికి ఇది అస్త్రంగా మారింది.
Recommended Video
సాయిరెడ్డికి అవమానమేనా..
వైయస్ మరణం నుండి జగన్తోనే ఉన్న విజయ సాయిరెడ్డికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించని పరిణామం ఎదురైంది. జగన్తో సాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో జైలు జీవితం సైతం గడపాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పాత్ర మరింత పెరిగింది .దీంతో..ఆయనకు ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి హోదా కల్పించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అక్కడే పొరపాటు జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఒక లాభదాయక పదవిలో ఉన్న వ్యక్తికి మరో పదవి ఇవ్వటానికి వీలు ఉండదు. ఈ అవగాహన ప్రభుత్వంలోని అధికారుల్లో లోపించింది. ఫలితంగా గత నెల 22న ఇచ్చిన జీవోను తాజాగా రద్దు చేస్తూ మరో ఉత్తర్వు ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఉత్తర్వులు వచ్చి 13 రోజులు అయినా సాయిరెడ్డి ఇప్పటి దాకా ఏపీ భవనకు వచ్చి అధికారికంగా కొత్త బాధ్యతలు తీసుకోకపోవటం కొంత వెసులుబాటు కలిగించింది.
దిద్దుబాటు చర్యలతో సరిదిద్దుకున్నట్లేనా..
ఢిల్లీ స్థాయిలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే నిర్ణయంలో ప్రభుత్వ అధికారుల తీరు ఇప్పుడు మచ్చగా కనిపిస్తోంది. జీవో జారీ చేయటం..22వ తేదీ జారీ చేసిన జీవోను ఈ నెల 4న రద్దు చేయటం ద్వారా ప్రభుత్వ ఇరకాటం లో పడింది. అసలు అవగాహన లేకుండా జీవో ఎలా ఇచ్చారనేది ఒక ప్రశ్న అయితే..పొరపాటు సరి దిద్దుకోవటానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనేది మరో సందేహం. ఇక, ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ దీనిని అంది పుచ్చుకుంది. రాజకీయంగా ఇరుకు పెట్టే వాదన తెర మీదకు తీసుకొచ్చింది. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడానికి ఈ పదవిని పొందిన విజయసాయిరెడ్డి చట్టానికి దొరికిపోయి దాని నుంచి తప్పించుకొనేందుకు జీవోను రద్దు చేయించుకొ న్నారని టీడీపీ సీనియర్ నేత యనమల విమర్శించారు. ముగ్గురు ఎంపీలను మంత్రివర్గ ఉప సంఘంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనర్హత వేటు వేయాలి..టీడీపీ డిమాండ్
ఇప్పుడు విజయ సామరెడ్డి నియామక ఉత్తర్వులు జారీ..ఉపసంహరణ అంశాన్ని వాడుకొని విజయ సాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటోంది టీడీపీ. అందులో భాగంగా.. లాభాపేక్ష కలిగిన పదవిలో 13 రోజులు కొనసాగినందుకు విజయసాయిరెడ్డిని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించి ఆయనపై వేటు వేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్టికల్ 102 (1)ఏ ప్రకారం ఆయనను ఎంపీ పదవికి అనర్హుడిగా ఈసీ తక్షణం ప్రకటించాలన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసినా అనర్హత తప్పదు. తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఆయనకు ఆ పదవి ఇస్తూ జీవో జారీ చేశారు. ఆ పదవిలో 13 రోజులు కొనసాగారు. చట్టం తెలియదని చెప్పడం కూడా చెల్లదు. ఆయనపై ఎన్నికల సంఘం చర్య తీసుకోక తప్పదు. మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని నివేదిస్తామని యనమల స్పష్టం చేసారు.