వివాదాలు.. కేరాఫ్ ఏపీ ప్రభుత్వం : ప్రతిష్ఠ పెరిగేనా..తరిగేనా: వీరి నిర్ణయాలు సరైనవేనా..!
ఏపీలో ఏం జరుగుతోంది. అన్నింటా వివాదాలే. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ అంశంలో వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం..తెలంగాణ ప్రభుత్వం..సీబీఐ..ఎన్నికల సంఘం..ఇప్పుడు ఏకంగా ఏపీలోనే పని చేస్తున్న అధికారులు..ఇలా అందరితో కొంత కాలంగా ఏపి ప్రభుత్వ పెద్దలు వివాదాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతుందా.. తగ్గిస్తుందా అనే దాని పైనా విశ్లేషణలు మొదలయ్యాయి.
కొంత కాలంగా మారిన వైఖరి..
చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నేత. మంచి అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్న రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వానికి..ఇతర వ్యవస్థలకు మధ్య అగాధం కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ లేని..చూడని వింత పరిస్థితి ఏపీలో దర్శనమిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో విభేదించి బయటకు వచ్చిన తరువాత కేంద్రం పైన పోరాటం చేసారు. దీని పైన ఎవరికీ అభ్యంతరం లేదు. అందరూ సహకరించారు. రాజకీయంగా కేసీఆర్..జగన్తో విభేదించారు. రాజకీయ పోరాటాల గురించి సామాన్యులకు వచ్చే సమస్య లేదు. అయితే, కొంత కాలంగా తమతో విబేధించినా..లేక తమకు సహకరించకపోయినా..వారందరినీ ద్రోహులుగా చిత్రీకరించటం అనేది ఏపీలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు..కొనసాగిస్తున్న వైఖరి గెరించి సామాన్య ప్రజలు సైతం చర్చిస్తున్నారు.
అతిగా స్పందిస్తున్నారా..లేక..ఇదే సరైనదా..
కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవే అంటూ ప్రభుత్వ మద్దతు దారులు చెబుతుంటే.. మరి కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వం అతిగా స్పందిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో విభేదాలు ఉన్నా.. తమ పార్టీ నేతల పైన దాడులు చేస్తున్నారనే కారణంతో సీబీఐకు ఏపీలో సాధారణ అనుమతి రద్దు చేసారు. అది అప్పట్లోనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. సొంత పార్టీ నేతలను కాపాడుకోవటానికే ఈ చర్చ అంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. ఇక, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల సంఘం పైనా విమర్శలు మొదలు పెట్టారు. ప్రతిపక్ష వైసీపీ చేసిన ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇస్తూ..తమ అధికారుల పైన చర్యలు తీసుకుంటున్నారని ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏపీలో అధికారుల పైన ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తున్న విమర్శలు సైతం వివాదాస్పదం అవుతున్నాయి. అధికారులకు రాజకీయాలు అంటగట్టి పార్టీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు సరైన విధానం కాదనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఎవరికి మేలు చేస్తాయి..
కొద్ది రోజులు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తాయనే చర్చ కొనసాగుతోంది. రాజకీయంగా టీడీపీకి ఏమైనా కలిసి వస్తుందా అంటే ఎన్నికలు ముగిసిన తరువాత.. ఆ ఆలోచన అవసరం లేదంటున్నారు. ఇక, ఏపీకీ ఏమైనా మేలు చేస్తాయా అంటే ఇది పూర్తిగా టీడీపీ వర్సెస్ వ్యవస్థల మధ్య వివాదంగా కనిపిస్తోంది. అన్నిటి కంటే సొంత అధికారులు ఇబ్బంది పడుతున్నారనే కారణంగా తాను సమీక్షలకు దూరంగా ఉంటున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా కేబినెట్ సమావేశం ఖరారు చేసి..అధికారులు ఎవరు రాకుండా ఉంటారో చూస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హెచ్చిరకలుగా ప్రచారం జరుగుతున్నాయి. ఐఏయస్ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయి పరిస్థితుల పైన చర్చలు చేస్తున్నారంటే..ఏపీలో ఎందుకీ పరిస్థితి ఏర్పడిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చే వేళ..ఏపీలో జరుగుతున్న రాద్దాంతాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.