తెలంగాణ వాహనాలకు ఏపీ సరిహద్దుల్లో బ్రేకులు- కేంద్రం అనుమతించినా....
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ లో కేంద్రం ఇస్తున్న సడలింపులు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయలుదేరిన వాహనాలకు సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్టు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వందలాది వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతించినా ఇప్పుడిప్పుడే పరిస్దితులు కుదురుకుంటున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఎలాంటి పాసుల్లేకుండా అనుమతిస్తే సమస్యలు తప్పవని ఏపీ సర్కార్ భావించింది. దీంతో పాసుల్లేకుండా అనుమతి లేదని డీజీపీ కార్యాలయం ఇవాళ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఆ లోపే హైదరాబాద్ నుంచి బయలుదేరిన వందలాది వాహనాలు ఏపీ సరిహద్దులకు చేరిపోయాయి. వీరిని ఏపీలోకి అనుమతించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వాహనదారరులు ఏపీలోకి రావాలంటే ఇక్కడి నిబందనలు పాటించాల్సిందే. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారిని వారు బయలుదేరిన ప్రాంతంలో లేదా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్ధితి ఆధారంగా ఏపీలోకి వచ్చాక క్వారంటైన్ నిబందనలను వర్తింపజేస్తున్నారు. ఇందులో తీవ్రమైన కేసులు నమోదైన రాష్ట్రాల నుంచి వచ్చే వారిని 14 రోజుల ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ కు పంపుతున్నారు.
అలాగే తక్కువ కేసులున్న రాష్ట్రం నుంచి వచ్చే వారిని ఏడు రోజుల సాధారణ క్వారంటైన్ కు పంపుతున్నారు. ఈ నిబంధనలకు అంగీకరిస్తే మాత్రం ఏపీ వాసులను అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలోకి రావాలంటే స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ దరఖాస్తు చేసి తీసుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.