లోక్సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ: ఇంగ్లీషు మీడియం వివాదం: కేంద్రం తేల్చిందేంటంటే..!
ఏపీలో రాజకీయగా తీవ్ర దుమారం రేపిన ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు అంశం లోక్ సభలోనూ చర్చకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మారుస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో తెలుగు అంశాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ లో ఆమోదించారు. దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. విమర్శలు చేసిన వారిపైన ముఖ్యమంత్రి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. అదే సందర్భంలో పవన్ పైన జగన్ వ్యక్తిగత ఆరోపణలు చేసారంటూ జనసేన..టీడీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసాయి. అయితే, ముఖ్యమంత్రి మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా..అడ్డంకులు వచ్చినా ఈ నిర్ణయం లో ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన లోక్ సభలో టీడీపీ..వైసీపీ సభ్యులు తమ వాదనలు వినిపించగా..కేంద్ మంత్రి తమ విధానం స్పష్టం చేసారు.
లోక్సభలో ప్రస్తావించిన కేశినేని నాని
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభ సమయంలోనే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న లేవనెత్తారు. సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఏపీలో జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ను తప్పనిసరి చేసిందన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్నారు. కేశినేని నాని మాట్లడే అసమయంలో పలు మార్లు సభ్యుల ఆందోళన కారణంగా బ్రేక్ పడినా..ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా తెలుగు బాషా వికాసానికి ఇబ్బందులు ఏర్పుడుతాయని ఆందోళన వ్యక్తం చేసారు.
ఇంగ్లీషు మీడియంతో తెలుగు ప్రాధాన్యత తగ్గదు
టీడీపీ నుండి కేశినేని మాట్లాడిన వెంటనే సభలో గందరగోళం సాగుతుండగానే వైసీపీ నుండి నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామక్రిష్టం రాజు స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్ధులను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయమని వివరించారు. ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూనే తెలుగు తప్పనిసరి చేసిన విషయాన్ని సభకు వివరించారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఛైర్ పర్సన్ గా తెలుగు అకాడమి..అదే విధంగా తెలుగు అధికార భాష సంఘం ఛైర్మన్ గా వైఎల్పీని నియమించామన్నారు. తెలుగు బాషకు ఏపీలో ఏ రకంగానూ విఘాతం కలగదని వివరించారు. రాజకీయంగా విమర్శల కోసమే దీనిని వివాదం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Recommended Video
కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే..
వీరిద్దరు మాట్లాడిన సభా వేదికగా..కేంద్రమంత్రి పోఖ్రియాల్ తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన పలు విషయాలపై వివరణ ఇచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారు పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు. తెలుగు భాషపై ఇందులో చర్చలు, నిర్ణయాలు ఉంటాయని, అలాగే, సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారని సభకు వివరించారు. దీంతో..ఈ అంశం సభలో ముగిసింది. ఇక, డిసెంబర్ 2 నుండి ప్రారంభమయ్యే ఏపీ శాసనసభా శీతాకాల సమావేశాల్లో ఇదే అంశం పైన చర్చించి..ఇప్పుటికే కేబినెట్ ఆమోదించిన నిర్ణయానికి బిల్లు రూపంలో ఆమోదం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.