ఐపీఎస్ ఏబీవీకి జగన్ సర్కారు మరో షాక్ -సస్పెన్షన్ మరో 6నెలలు పొడగింపు -జగన్ ఢిల్లీలో ఉండగానే
చంద్రబాబు హయాంలో ఏపీ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్ గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు జగన్ సర్కారు మరో షాకిచ్చింది. దేశభద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి..
నిఘా పరికరాల స్కామ్
ఏబీవీపై మరో ఆరు నెలల పాటు సస్పెన్షన్ను పొడగిస్తున్నట్లు ఏపీ సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. టీడీపీ చీఫ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీవీ.. దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు, డ్రోన్ల కొనుగోళ్లు చేశారని, అందులో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఐపీఎస్ అధికారిపై ఈరకమైన ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశమైంది.
సుప్రీంకు ఏపీ సర్కార్..
జగన్ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, అక్రమంగా చర్యలకు ఉపక్రమించిదంటూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన సస్పెన్షన్పై గతంలో స్టే వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం వేటును కొనసాగించింది. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో ఏబీవీ నేరానికి పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. గతవారం..
జగన్ సర్కారుపై ఏబీవీ ఫైర్
తనపై ప్రభుత్వం చేసిన నేరారోపణకు ఏబీ వెంకటేశ్వరావు గతవారం కోర్టులో సమాధానం ఇచ్చారు. సమాధానానికి 30 రోజులు గడువు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం 15 రోజులే ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరారోపణ పత్రాలు కూడా ప్రభుత్వం తనకు ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి నష్టం జరగని కొనుగోళ్లలో తానెలా దోషినౌతానని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సీపీఆర్వో శ్రీహరితో 7 పేజీల ఆరోపణల నోట్తో ప్రచారం చేయించారన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదని ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు తెలిపారు.