నాడు జగన్ కేసులు విచారించారు: నేడు ప్రభుత్వ కేసుల్లో చిక్కారు : కృష్ణ కిషోర్ పై సీఐడి అభియోగాలు..!
ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్ గురై..రాజకీయ వివాదానికి కారణమైన ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ పైన కేసు నమోదైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్యుటేషన్ మీద ఏపికి వచ్చిన కృష్ణ కిషోర్ ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా పని చేసారు. కొద్ది రోజుల క్రితం ఆయన తనను తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రిలీవ్ చేయాల్సిందిగా కోరారు. అయితే, ఆయన మీద ఉన్న అభియోగాలతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో ఐటీ అధికారిగా జగన్ కేసులను విచారించిన అధికారి కావటంతో..ఆయన్ను ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా సస్పెండ్ చేసి వేధిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఇక, ఇప్పుడు కోట్లాది రూపాయాల ప్రజాధనం దుర్వినియోగం చేసారంటూ కృష్ణ కిషోర్ పైన సీఐడీ కేసు నమోదు చేసింది.
కృష్ణ కిషోర్ పైన సీఐడీ కేసు నమోదు..
నాలుగు రోజుల క్రితం ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన మీద నిధుల దుర్వినియోగం చేసారంటూ కేసు నమోదైంది. మంగళగిరి సీఐడీ పీఎస్ లో సీఐడీ కేసు నమోదు చేసింది. భారతీయ నేర శిక్షా స్మృతి 188,403,409,120B సెక్షన్ల తో పాటు,ఏపీ ఈడీబీ 2018 చట్ట ప్రకారం కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. 22/2019 క్రైమ్ నెంబరుతో కేసు దాఖ లైంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేయటం..ఈడీబీలో తన అనునయులకు ఉద్యోగాలు ఇవ్వటం వంటి అభియోగాలు ఆయన మీద నమోదయ్యాయి.
పారదర్శకత లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసారంటూ కేసు నమోదు చేసారు. ఈడీబీ లోని మాజీ అకౌంట్స్ అధికారి బి శ్రీనివాసరావు పై కూడా కేసు నమోదు అయింది. ఈడీబీ కి చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి. తులసి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఇరువురి పైనా కూడా అభియోగాలు నమోదు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నాడు జగన్ కేసుల విచారణలో..
ఐఆర్ఎస్ అధికారి అయిన కృష్ణకిశోర్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపికి డిప్యుటేషన్ పైన వచ్చారు. అంతకు ముందు ఆయన పదేళ్ల కిందట వైఎస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లో ఆర్థిక అక్రమాల విచారణ అధికారిగా పని చేసారు. కృష్ణ కిశోర్ 2009లో ఆదాయపు పన్ను శాఖలో హైదరాబాద్ రేంజ్-2 అదనపు కమిషనర్గా ఉన్నారు. ఆయనకంటే పై హోదాలో కమిషనర్, చీఫ్ కమిషనర్ ఉంటారు. అప్పట్లో... జగతి పబ్లికేషన్స్ సంస్థ 10 రూపాయల ముఖ విలువ ఉన్న షేరును... రూ.370 చొప్పున విక్రయించింది. అంటే... ఒక్క షేరుకు రూ.360 ప్రీమియం! ఈ లావాదేవీ సక్రమంగానే జరిగిందా అనే విషయం తేల్చాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హైదరాబాద్ రేంజ్-2 ఐటీ అధికారులకు ఫైలు పంపింది.
ఈ బాధ్యతను అదనపు కమిషనర్గా ఉన్న జాస్తి కృష్ణ కిశోర్కు అప్పగించారు. ఆయన దీనిపై లోతుగా విచారణ జరిపి..అవినీతి జరిగిందని తేల్చారు. క్విడ్ ప్రోకోగా నిర్ధారించారు. దీనిని సీబీఐ కూడా పరిగణనలోకి తీసుకుంది. దీనిని మరింత లోతుగా విశ్లేషించి, దర్యాప్తు జరిపి... జగన్ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు నమోదు చేసింది.
వేధిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్..
కేంద్ర సర్వీసులకు చెందిన కృష్ణ కిషోర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సస్పెండ్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కేసులను విచారించిన అధికారి కావటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అంతకు ముందు జగన్ తన బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ విమర్శలు ప్రారంభించింది.
ఇదే అంశం పైన తాము సభలో లెవనెత్తుతామనే..మార్షల్స్ అంశం ప్రభుత్వం సభలో తీసుకొచ్చిందిని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దీనికి వైసీపీ సైతం తప్పు చేసిన వారి పైన చర్యలు తీసుకోకుండా ఏం చేయాలని ప్రశ్నించింది. ఇప్పుడు. అదే అధికారి పైన కేసు నమోదు చేయటంతో టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. నాడు జగన్ కేసులను విచారించిన అధికారిగా పని చేసిన కృష్ణ కిషోర్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే అవినీతి ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్నారు.