బిల్లుల ఆమోదంతోనే రాజధాని తరలింపు- హైకోర్టుకు హామీ- జగన్ వ్యూహమిదేనా ?
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖఫట్నానికి తరలించేందుకు గతంలో ప్రభుత్వం పెట్టుకున్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకు వ్యతిరేక వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే కోవలో రాజధాని తరలింపును అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. అయితే చట్టపరంగా ప్రక్రియ ప్రారంభం కాకుండా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయితే ముందస్తు భయాలను దృష్టిలో ఉంచుకుని తమకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది.
ఏపీ సీఎం కీలక నిర్ణయం..!అమరావతి భూములపై సీబిఐ దర్యాప్తు..?
హైకోర్టులో రాజధాని పంచాయతీ...
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు కేంద్ర బిందువుగా మారిపోతోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకుండానే వ్యతిరేక వర్గాలు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్దితి. దీంతో ప్రభుతాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని మాత్రమే సూచించింది. దీంతో తమ ఉద్దేశాన్ని జగన్ సర్కారు... అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం శాసన ప్రక్రియ పూర్తయ్యే వరకూ అంటే అసెంబ్లీలో బిల్లుల ఆమోదం పూర్తయ్యే వరకూ రాజధాని తరలింపుపై ఎదురు చూస్తామని మాత్రమే పేర్కొంది.
జగన్ దూకుడు... రాజధాని వ్యతిరేకుల్లో భయాలు
రాజధాని తరలింపు కోసం సీఎం జగన్ పెట్టుకున్న టార్గెట్, ఉద్యోగులు కోరిన టార్గెట్ కూడా మే 31. ప్రస్తుతం జగన్ ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తే వారం రోజులు సమయం దొరికినా ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజధాని తరలింపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఉద్యోగులతో కలిసి వెళ్లేందుకు అవకాశం లేకపోతే ఈ నెల 28న జగన్ తానొక్కడే విశాఖ వెళ్లి అక్కడి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇందులో వాస్తవమెంతో తెలియకపోయినా ప్రస్తుతానికి ఈ దూకుడు అమరావతి రాజధాని కోరుకుంటున్న వారికి నిద్రలేకుండా చేస్తోంది.
శాసన ప్రక్రియ పూర్తి అంటే ...
ప్రస్తుతానికి ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఇచ్చిన హామీని ఓసారి పరిశీలిస్తే శాసన ప్రక్రియ పూర్తయ్యే వరకూ రాజధాని తరలింపుపై ఎదురు చూస్తామని. అంటే ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలోనూ ఆమోదించడం ద్వారా రాజధాని తరలింపుకు శాసన వ్యవస్ధ ఆమోదం తీసుకుంటామనే. అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఇదంతా సాధ్యమేనా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. రాజధాని బిల్లులను ఆమోదించకుండా, వ్యతిరేకించకుండా సెలక్ట్ కమిటీ పేరుతో కాలయాపనకు సిద్ధమైన శాసనమండలి రద్దు కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అంటే మండలిలో ఆమోదం సమస్యే లేదు.
Recommended Video
శాసన ప్రక్రియ పేరుతో అఫిడవిట్ వెనుక వ్యూహమిదేనా
శాసన ప్రక్రియ పేరుతో హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ వేయడం వెనుక వ్యూహాన్ని ఓసారి గమనిస్తే రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా వరుసగా దాఖలవుతున్న పిటిషన్లకు ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన పరిస్ధితి మాత్రమే. అంటే తక్షణం ప్రభుత్వ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్దితుల్లో కీలకమైన శాసనప్రక్రియ ద్వారానే ముందుకెళ్తామని హైకోర్టుకు చెబితే అందులో అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చు. ఓసారి శాసనవ్యవస్ధ ఆమోదించిన బిల్లులను అత్యవసరమనుకుంటే తప్ప, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే తప్ప హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. మరోవైపు కేంద్రం వద్ద ఇప్పటికే మండలి రద్దు బిల్లు పెండింగ్ లో ఉంది. కేంద్రం తలచుకుంటే దీనిపై ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. అదే జరిగితే అసెంబ్లీ ఆమోదం పొందిన రాజధాని బిల్లులు శాసన ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లే. మండలిలో బిల్లుల ఆమోదం సాధ్యం కాదు కాబట్టి కాలాతీతమైన బిల్లులను మండలి కూడా ఆమోదించినట్లే లెక్కించడం ఓ ఎత్తుగడ అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మండలి ఆర్డినెన్స్ తెచ్చుకోవడం మరో ఎత్తు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా జగన్ ప్రభుత్వానికి రాజధాని తరలింపులో సమస్యలన్నీ తీరినట్లే.