అమరావతే రాజధాని..కానీ: అర్ద్రరాత్రి బిల్లుకు తుది రూపం: ప్రభుత్వ ఫైనల్ వ్యూహం ఏంటంటే..!
రాజధానుల అంశం పైన పక్కా వ్యూహాత్మకంగా..అత్యంత రహస్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం..అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లుకు తుది రూపు ఇచ్చింది. అనేక తర్జన భర్జనల తరువాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లును అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తెల్లవారు జామున రెండున్నార గంటల ప్రాంతంలో ఈ బిల్లు సిద్దమైంది. ఎక్కడా సాంకేతిక..న్యాయ పరమైన చిక్కులు రాకుండా..అదే విధంగా బిల్లు ఆమోదా నికి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును సిద్దం చేసారు. ఈ రోజు తొలుత కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించి..ఆ వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈ బిల్లును ప్రతిపాదించనున్నారు. ప్రతిపక్షాలు సహకరిస్తే చర్చ..లేకుంటే అధికార పార్టీకి చెందిన మూడు ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడించి బిల్లును ఆమోదించేలా నిర్ణయించారు. ఇక..శాసనసభలో ఆమోదించిన బిల్లును శాసనమండలిలోనూ ఇబ్బంది లేకుండా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొత్తంగా ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగా అధికారిక ఆమోదం పొందేలా వ్యూహం అమలు చేస్తోంది.
అమరావతే రాజధాని..కానీ..
ఏపీ రాజధాని ఏదనే ప్రశ్నకు కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా సమాధానం రానుంది. చంద్రబాబు ప్రభుత్వం 2014లో ప్రకటించిన విధంగా.. కేంద్రం భౌగోళిక మ్యాపులో గుర్తించిన విధంగా ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగనుంది. కానీ, అధికారం మాత్రం అమరావతిలో ఉండదు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులో ఇదే విషయం ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేయనుంది. ఎక్కడా రాజధాని తరలింపు అనే అంశం ప్రస్తావించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. కేవలం పరిపాలనా విధులను మాత్రమే విస్తరిస్తున్నామని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించనుంది. బిల్లు ఆమోదం పొందిన తరువాత జీవో ద్వారా అధికారికంగా సచివాలయ తరలింపు..శాఖల తరలింపు పైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా అధికారిక నిర్ణయానికి ఎక్కడా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అమరావతి రాజధానిగా ఉంటుందని చెబుతూ..ముందుగా రాజధాని కార్యకలాపాలు..పరిపాలనా విధలు వికేంద్రీకరణ దిశగా బిల్లులో ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
సీఆర్డీఏ స్థానంలో... మనీ బిల్లుగానే ముందుకు
ఇక..శాసనసభలో తమకు మెజార్టీ ఉండటంతో తమ ప్రతిపాదనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమోదం పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయినా..సాంకేతికంగా..న్యాయపరంగా తమ ఆలోచనల అమల్లో ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందు కోసమే అమరావతి ప్రాంతం ఇప్పటి వరకు సీఆర్డీఏ పరిధిలో ఉండగా..ఇక నుండి అమరావతి మెట్రో డెవలప్ మెంట్ రీజియన్ గా ఖరారు చేస్తూ ప్రబుత్వం మరో బిల్లు ప్రతిపాదించనుంది. దీని కోసం సీఆర్డీఏ బిల్లును మనీ బిల్లుగానే ప్రభుత్వం సభలో సవరణలకు ప్రతిపాదించనుంది. దీని ద్వారా శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ అడ్డుపడి బిల్లు తిరస్కరణకు గురైనా.. మనీ బిల్లు కావటంతో 14 రోజుల్లోగా డీమ్డ్ టు బీ యాక్సెప్టెడ్ గా పరిగణిస్తారు. దీంతో..ఈ బిల్లును ఆ విధంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో.. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ పరిధిలోని రాజధాని గ్రామాలను ..తీసుకురావటంతో పాటుగా అక్కడ చేయబోయే డెవలప్ మెంట్ గురించి ఆలోచనలను సభలో వివరించనున్నారు.
అర్ద్రరాత్రి తుది ఆమోదం..
అనేక చర్చలు..మంతనాలు..సమావేశాల తరువాత ముఖ్యమంత్రి సూచనల మేరకు తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో బిల్లుకు తుది రూపం ఇచ్చారు. అందులో ఎక్కడా రాజధాని మార్పు అనే అంశాన్ని ప్రస్తావించకుండా..కేవలం పరిపాలనా విధులు..ప్రభుత్వం ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ బిల్-2020 పేరుతో కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగు జోన్లుగా 13 జిల్లాలను విభజించి బోర్డులు ఏర్పాటు దిశగా ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించనుంది. దీని మీద ముందుగా..కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. మంగళవారం మండలి లో జరిగే చర్చలో సీఎం పాల్గొంటారు. మండలిలో ఒక వేళ బిల్లు తిరస్కరించినా..ద్రవ్య బిల్లుగా ప్రతిపాదిస్తుండటంతో సాంకేతికంగా 14 రోజుల్లో ఆమోదం పొందే అవకాశం ఉండటంతో...ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం సైతం ఖరారు చేసారు.