అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు శుభవార్త: సంస్థ అప్పుల కంటే ఆస్తులే ఎక్కవ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ చైర్మన్ నర్సింహమూర్తి సోమవారం తెలిపారు. అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించిన విచారణ కమిటీ మంగళవారం ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.
అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు రూ.7,000 కోట్లు ఉన్నాయని కమిటీ ఛైర్మన్ నర్సింహమూర్తి సీఎం చంద్రబాబుకి వివరించారు. సంస్ధ డిపాజిటర్లలకు రూ. 6,800 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. సంస్థ ఆస్తులను బహిరంగ వేలం వేస్తే రూ.7,000 కోట్ల కంటే ఎక్కవే రావొచ్చని కమిటీ వివరించింది.
అగ్రిగోల్డ్ బాధితులు దేశ వ్యాప్తంగా 32లక్షల మంది ఉండగా ఒక్క ఏపీలోనే 19 లక్షల మంది ఉన్నారు. ఈ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు రెండు, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం అన్నారు.
బాధితుల్లో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంస్ధ ఆస్తులు అమ్మైనా సరే డిపాజిటర్ల సొమ్ము వచ్చేలా చూడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నర్సింహమూర్తి డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు.
సంస్థకు ఉన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. సంస్థకు చెందిన మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కోర్టు అనుతిస్తే, వచ్చే నెలలోనే సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయిస్తామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అగ్రిగోల్డ్ విచారణ కమిటీ కో ఛైర్మన్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ లక్షలాది మంది నుంచి రూ.7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించింది. మెచ్యూరిటీ తీరిన బాండ్ల సొమ్ము చెల్లించడంలో చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.