ఏప్రిల్ 14 తర్వాత ఏపీలో అక్కడ లౌక్ డౌన్ ఎత్తివేత ! - సర్కారు సంకేతాలు
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుండటంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు లాక్ డౌన్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్దితిని సమీక్షించిన అధికారులు.. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ విషయంలో పునరాలోచన చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఏపీలో లాక్ డౌన్ పై సమీక్ష..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ కొనసాగనుంది. అయితే ఏపీలో తాజాగా కరోనా బాధితులందరినీ పరీక్షించిన ప్రభుత్వం, ఇంకా మిగిలిన వారికీ రెండ్రోజుల్లో పరీక్షలు నిర్వహించనుంది. ఇంకా ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానాలతో ర్యాండమ్ టెస్టులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కల మూడు రోజుల్లో రాష్ట్ర్లంలో కరోనా పరిస్ధితిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ విషయంలో పునరాలోచన చేస్తోంది.
అక్కడ లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం..
ఏపీలో ఇప్పటివరకూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా లక్షణాలతో కొందరికి పరీక్షలు నిర్వహించినా నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో ఏప్రిల్ 14 తర్వాత పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో కేవలం సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాల్లోనూ లాక్ డౌన్ ఎత్తేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మరో రెండు రోజుల్లో కరోనా శాంపిల్స్ ఫలితాలు పూర్తిస్దాయిలో వచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
Recommended Video
ప్రధాన నగరాలు, పట్టణాల్లో మాత్రం..
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి చోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే పలు పట్ఠణాల్లోనూ కరోనా బాధితులు నమోదయ్యారు. వీరిని ఇప్పటికే క్వారంటైన్ కు పంపి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులుగా తేలిన వారిలో ఆరుగురు ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జి కూడా అయ్యారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా కేసులు నమోదైన అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.