విజయ సాయిరెడ్డికే తిరిగి ఆ పదవి: కీలక నిర్ణయం తీసుకున్న జగన్..: వివాదానికి ఇలా తెర దించారు..
ఏపీ ప్రభుత్వం పొరపాటు సరి దిద్దుకుంది. తమ పొరపాటు కారణంగా విజయ సాయిరెడ్డికి దక్కాల్సిన పదవి మరొకరికి ఇవ్వటానికి ఇష్టపడ లేదు. సాయిరెడ్డికే ఆ పదవి దక్కేలా లైన్ క్లియర్ చేసింది. అందులో భాగంగా ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి మరీ సాయిరెడ్డికే ఆ పదవి కట్టబెట్టారు. దీంతో రెండు రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారానికి తాజా ఆర్దినెన్స్ ద్వారా ముగింపు పలికేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, టీడీపీ మాత్రం దీని పైన పోరాటం చేస్త మని ప్రకటించింది.
సాయిరెడ్డికే తిరిగి ఆ పదవి..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించటం .. సాంకేతిక కారణాలతో తిరిగి రద్దు చేయటంతో ఈ వ్యవహారం వివాదస్పదమైంది. అయితే, సాయిరెడ్డి నియామకంలో పట్టుదలతో ఉన్న జగన్ దీనికి సంబంధించి చట్ట సవరణకు నిర్ణయం తీసుకున్నారు. గత నెల 22న విజయ సాయి రెడ్డిని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రత్యేక ప్రతినిధి హోదాలో కొనసాగటం ద్వారా రెండు లాభ దాయక పదవుల్లో ఉన్నట్లుగా ఉండటం సాధ్యం కాదని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో..రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం విజయ సాయిరెడ్డిని గతంలో నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసింది. ఈ సవరణ ఆర్డినెన్స ద్వారా తిరిగి విజయ సాయిరెడ్డికే ఆ పదవి దక్కేలా ముఖ్యమంత్రి నిర్ణయించారు.
Recommended Video
అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ..
ఢిల్లీ స్థాయిలో పైరవీలు..వ్యాపారాల కోసం జగన్ ప్రభుత్వం విజయ సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి గా నియమించిందని టీడీపీ ఆరోపించింది. అయితే సాంకేతికంగా ఆయన నియామకం చెల్లదని తెలియటంతో దొడ్డి దారిన జీవోను రద్దు చేసిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ ఆరోపించారు. గత నెల 22న జీవో ఇచ్చారని ..తిరిగి ఈ నెల 4వ తేదీన జీవో రద్దు చేసారని..ఈ మధ్య కాలంలో విజయ సాయిరెడ్డి నిబంధనలకు వ్యతిరేకంగా జోడు పదవుల్లో కొనసాగారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ జీవోల ఆధారంగా విజయ సాయిరెడ్డి మీద అనర్హత వేటు వేయాలని తాము పిటీషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. అయితే, గత నెల 22న జీవో జారి అయినా విజయ సాయిరెడ్డి దీనికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయనకు దీని కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసినా అక్కడ కార్యాలయం కూడా ప్రారంభించలేదు. దీని ద్వారా విజయ సాయిరెడ్డి జోడు పదవులు నిర్వ హించ లేదనే విషయం స్పష్టం అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
సరిదిద్దుకున్న ప్రభుత్వం..
విజయ సాయిరెడ్డి తొలి నుండి జగన్కు నమ్మిన బంటుగా ఉంటున్నారు. ప్రతీ సందర్బంలోనూ తన వంతు సహకారం అందించారు. వైసీపీ తరపున ఢిల్లీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత ఇద్దరు రాజ్యసభ సభ్యులు..22 మంది లోక్సభ సభ్యులకు ఆయన పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఇక, రాజ్య సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికారుల అవగాహన లోపం కారణంగా వివాదం ఏర్పడింది. చివరకు దీనిని ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి తిరిగి విజయ సాయిరెడ్డికే ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ తన నిర్ణయాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.