ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్న్యూస్: ఎల్లుండి నుంచే
అమరావతి: పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. క్యాలెండర్ ప్రకారం సోమ, లేదా మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమౌతుంది. సోమవారం మిగులు అమావాస్య ఉన్నందున.. నెలవంక కనిపించే అవకాశం లేదని చెబుతున్నారు. నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్ మాసం ఆరంభమౌతుంది.. దానితో పాటుగా వారి కఠోర ఉపవాస దీక్షలు కూడా.తెల్లవారు జాము నుంచే ముస్లింలు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటారు.
Recommended Video
సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం మరోసారి ప్రార్థనల్లో పాల్గొని.. ఆ రోజుకు ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు కొంత వెసలుబాటు కల్పించింది. ప్రార్థనల్లో పాల్గొనడానికి, ఉపవాస దీక్షను విరమించడానికి వీలుగా గంట ముందుగా వారు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. అందుకే- ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. రంజాన్ పండుగ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మే 13 లేదా 14వ తేదీ రంజాన్ పండుగను జరుపుకొంటారు. ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనది. భక్తి శ్రద్ధలతో వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. రోజూ అయిదుపూటలా నమాజ్ చేస్తారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మసీదుల్లో ప్రత్యేకంగా సామూహిక ప్రార్థనలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేయలేదు. గత ఏడాది రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఇళ్లల్లోనే నమాజ్ చేశారు. అదే పరిస్థితి ఈ సారి కూడా ఉత్పన్నం అయ్యే అవకాశాలు లేకపోలేదు.