యూనివర్శిటీల్లో...అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అమరావతి:ఉన్నత విద్యావంతులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే...ఆంధ్రప్రదేశ్ లోని 14 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు.
ఈ నియామకాల ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 13 వరకు జరుగుతుందన్నారు. గతంలో ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు మంత్రి గంటా స్పష్టం చేశారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ రెండు దశలుగా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఇందుకోసం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఈ నెల 25 నుంచి హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల విధివిధానాలపై రాఘవులు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటి 2015లో రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి గంటా తెలిపారు. ఆ నివేదికలో రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోని 3258 పోస్టులను భర్తీ చేయాలని కమిటీ పేర్కొందని గంటా చెప్పారు. అయితే ఇందులో 48 శాతం పోస్టులు ఇప్పటికే భర్తీ జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు.