ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ఇక చుక్కలే- ఇష్టారాజ్యంగా ఫీజులకు చెక్- ఈఎంఐ ఇవ్వాల్సిందే...
ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ఇంగ్లీష్ మీడియం రూపంలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకునేలోపే ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాఠశాలల్లో, కాలేజీల్లో ఇకపై ఇష్టానుసారంగా ఫీజుల వసూలుకు చెక్ పెడుతూ పాఠశాల విద్యనియంత్రణ కమిషన్ కు ఫీజుల నిర్ణయాధికారాన్ని కట్టబెట్టింది. నాణ్యమైన విద్య అందించే క్రమంలో ఫీజులతో పాటు ప్రైవేటు విద్యాసంస్ధల్లో తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ కు సర్వాధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. '
ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై పట్టువీడని ప్రభుత్వం- మరో కీలక నిర్ణయం...
ప్రైవేటు స్కూళ్లకు చుక్కలు..
ఏపీలో ఇన్నాళ్లూ విద్యార్ధుల తల్లితండ్రుల శ్రమను ఇష్టారాజ్యంగా దోచుకున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో వసతులు లేకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రైవేటు స్కూళ్లను వాటిలో వసతులు, విద్యాబోధన నాణ్యత ఆధారంగా ఫీజులను నిర్ణయించే అధికారాన్ని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ కు కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నీ ఇకపై కమిషన్ పరిధిలోకి వెళ్లిపోబోతున్నాయి.
కమిషన్ కు సర్వాధికారాలు..
ఇకపై ఏపీలోని ప్రైవేటు విద్యాసంస్ధల్లో ప్రమాణాల పెంపుతో పాటు ఫీజుల నియంత్రణ, సదుపాయాల కల్పన, సరైన బోధనా విధానాలు వంటి అనేక అంశాల్లో చర్యలు తీసుకునేలా కమిషన్ కు పూర్తి అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఇకకపై ప్రైవేటు విద్యా సంస్ధల్లో ఫీజులు, విద్యాబోధన, వసతులతో పాటు అన్ని అంశాలూ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించే అధికారం కూడా కమిషన్ కు కల్పించారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు ట్యుటోరియర్స్ పైనా కమిషన్ కు అధికారం ఉంటుంది. ఎస్సీఈఆర్టీ, ఇంటర్మీడియెట్ బోర్డు, ఎన్సీటీఈ రూపొందించిన పాఠ్య పుస్తకాలను విద్యాసంస్ధలన్నీ వినియోగించేలా నిబందనలు కఠిన తరం చేస్తున్నారు. 1 నుంచి పదో తరగతి వరకూ పరీక్షల నిర్వహణ కూడా కమిషన్ పర్యేవేక్షించనుంది.
కొత్త విధానంలో ఫీజుల దరఖాస్తు ఇలా...
తాజాగా కమిషన్ కల్పించిన అధికారాలను బట్టి చూస్తే ప్రతీ ఏటా విద్యాసంస్దలు ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిపికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత విద్యాసంస్ధలు ఆన్ లైన్లో ఫీజుల ప్రతిపాదలను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ విద్యా సంస్ధ ఖాతా పుస్తకాలతోపాటు ఇతర డాక్యుమెంట్లు కమిషన్ కు సమర్పించాలి. విద్యాసంస్ధలు పేర్కొన్న ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనేది కమిషన్ పరిశీలిస్తుంది. ఆరు ప్రమాణాల ఆధారంగా వీటిని ఖరారు చేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా ఫీజుల్లో కోత తప్పదు.
ఫీజుల వసూలుకు కొత్త రూల్స్...
కొత్త విధానంలో ఏ విద్యాసంస్ధ కూడా ఏడాది ఫీజును ఒకేసారి తల్లితండ్రుల నుంచి వసూలు చేసేందుకు వీలులేదు. అంటే ఫీజులను విడతల వారీగా చెల్లించేందుకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సిందే. అలాగే ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకూ సర్వీస్ నిబంధనలను వర్తింపచేయనున్నారు. టీచర్ల నియామకంలో ఎన్సీటీఈ నిబంధనలు పాటించాల్సిందే. అలాగే విద్యా సంస్ధల్లో సమస్యలపై విద్యార్ధుల తల్లితండ్రులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్ సెల్ ను, అలాగే స్కూల్ డేటాబేస్ నిర్వహణకు ఐటీ సెల్ ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.
Recommended Video
నిబంధనలను ఉల్లంఘిస్తే....
రాష్ట్రంలో ఏ విద్యా సంస్ధ అయినా కమిషన్ నిర్ణయించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వాటి గుర్తింపును తక్షణం రద్దు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫీజులను కూడా లాభార్జన కోసం కాకుండా నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా తీసుకునేలా కొత్త రూల్స్ తెస్తున్నారు. వీటిని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే కమిషన్ సదరు విద్యా సంస్ధలను బ్లాక్ లిస్ట్ లో ఉంచడం, వాటి గుర్తింపు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు.