జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం: ఇక ఇంటి వద్దకే: మొబైల్ రైతుబజార్లు: పరిమళ్ నత్వానీ .. !
శ్రీకాకుళం: భయానక కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ గుమ్మం దాటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దేశం మొత్తం మీద ఇప్పుడున్న కర్ఫ్యూ, అత్యయిక పరిస్థితులు వచ్చేనెల 14వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. ఆ తరువాత కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయా? లేదా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది. లాక్డౌన్ను ఎప్పుడు ఎత్తేస్తారనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో రోజువారి కార్మికులు, దినసరి వేతన కార్మికుల, రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కూడా వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. దీనితోపాటు- నాలుగు రోజుల ముందే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి సిద్ధపడింది. ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది కూడా.
Very unique initiative for farmers and I congragulate the young & dynamic @AndhraPradeshCM Shri @ysjagan for coming up with this wonderful idea. @VSReddy_MP @yvsubbareddymp @YSRCParty @YSRCPDMO @MithunReddyYSRC @ChevireddyYSRCP @JaganArmy_ https://t.co/dGYuphrLQ6
— Parimal Nathwani (@mpparimal) March 29, 2020
దీనికి అదనంగా కొత్తగా మొబైల్ రైతుబజార్లను ప్రారంభించింది. కొనుగోలుదారుల ఇళ్ల వద్దకే కూరగాయాలను అందజేసే ఏర్పాట్లను చేసింది. ఆదివారం ఉదయం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ మొబైల్ రైతుబజార్లను ప్రారంభించింది జిల్లా అధికార యంత్రాంగం. క్రమంగా అన్ని జిల్లాలు, ప్రధాన పట్టణాల్లో ఈ మొబైల్ రైతుబజార్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మొబైల్ రైతుబజార్లను రెండు, మూడు రోజుల్లో తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని హర్షాన్ని వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొని ఉందని, దీన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని నత్వానీ అన్నారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యను తీసుకోవడం జగన్ను అభినందిస్తున్నట్లు చెప్పారు.