TTD: టీటీడీలో 300 బంగారు నాణేలు మాయం: నాలుగేళ్లుగా చేతివాటం: రిటైర్డ్ ఉద్యోగులపై విచారణ
తిరుపతి: కాచేవాడినే దోచేయడం అంటే ఇదే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారు నాణేలను కొట్టేశారు కొందరు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు. 50 కాదు.. వందా కాదు.. ఏకంగా 300 బంగారు నాణేలను దొంగిలించారు. నాలుగేళ్లుగా దశలవారీగా వారు ఈ నాణేలను తస్కరించినట్లు తేలింది. ఈ చోరీకి పాల్పడి ఉద్యోగులంతా ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. వారంతా బంగారు డాలర్ల విక్రయ కౌంటర్లలో పనిచేసే ఉద్యోగులుగా నిర్ధారించారు.
శ్రీవారికి సంబంధించిన 300 బంగారు నాణేలను చోరీ చేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఒక్కో బంగారు నాణేం బరువు అయిదు గ్రాములు. 300 బంగారు నాణేలు మాయం అయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జే సత్యనారాయణను నియమించింది. మూడు నెలల్లోగా నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం, భూములు) శాఖ కార్యదర్శి వీ ఉషారాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ఇదివరకు ఇదే కేసుపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కమిషనర్ ఆప్ ఎంక్వైరీస్ కే సహదేవ రెడ్డి విచారణాధికారిగా పనిచేశారు. దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఆయనను తప్పించింది ప్రభుత్వం. సహదేవ రెడ్డి స్థానంలో జే సత్యనారాయణను నియమించింది. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని సూచించింది. 300 బంగారు నాణేలు మాయమైన కేసులో రిటైర్డ్ ఉద్యోగులను విచారించాలని పేర్కొంది.
ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ష్రాఫ్ కే వెంకటాచలపతి, సూపరింటెండెంట్లు, ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఎం వెంగన్న, కె గోవర్ధన్, ఎస్ గజపతి, ఏవీ రమణమూర్తి, ఏ రఘురామి రెడ్డి, సహాయ కార్యనిర్వాహణాధికారి ఈ రామచంద్రా రెడ్డి, ఉప కార్యనిర్వహణాధికారి ఆర్ రంగనాథాచారి, ఎన్ చెంచులక్ష్మి, ఆర్ ఉమాపతి, సహాయ కార్యనిర్వహణాధికారి కే చిత్తరంజన్, సీనియర్ అసిస్టెంట్లు పీ ఆంజనేయులు, శ్రీరామ్, బీ మురళీకృష్ణ మూర్తి రాజు, జీ గీతా కుమార్, బీఆర్ గురురాజా రావుపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
వీరిలో శ్రీరామ్, బీఆర్ గురురాజా రావు, గీతా కుమార్ ప్రస్తుతం టీటీడీలో పని చేస్తున్నారు. మిగిలిన వారంతా పదవీ విరమణ చేశారు. ఈ 17 మందిపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 300 బంగారు నాణేలు మాయం కావడం అంటే మాటలు కాదని, కోట్లాదిమంది భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారాన్ని కరిగించి, నాణేలుగా మార్చి, వాటిని విక్రయానికి ఉంచిన నాణేలని అధికారులు చెబుతున్నారు. నాణేల కౌంటర్లలో పనిచేసే ఉద్యోగులు వాటిని మాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.