ఏపీ ప్రభుత్వ ఆనందం ఆవిరి: సీఎం జగన్కు కొత్త టెన్షన్: టీడీపీకి ఆయుధంగా!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కొత్త టెన్షన్ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయితే..జరుగుతున్నది మరొకటిగా మారింది. పోలవరం రివర్స్ టెండరింగ్ పనుల్లో చివరకు ఒక సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. గతంలో ఖరారు చేసిన నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్లను అనుమతించే అవకాశం లేదు. అయితే..ప్రీబిడ్ సమావేశానికి ఎనిమిది కంపెనీలు హాజరైనా చివరకు ఏడు సంస్థలు తప్పుకున్నా యి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విషయంలో ఈ విధంగా మెఘా సంస్థ మాత్రమే నిలిచింది.
అయితే..ఇదే సంస్థ గురించి గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ విమర్శలు చేసారు. చంద్రబాబు హాయంలో పట్టి సీమ ప్రాజెక్టులో ఈ సంస్థకు వందలాది కోట్లు దోచిపెట్టారని నాడు జగన్ ఆరోపించారు. ఇప్పుడు అదే సంస్థకు పోలవరం అప్పగిస్తారా. కొత్తగా మరోసారి టెండర్లు పిలుస్తారా. అటు తెలంగాణతో పాటుగా జాతీయ స్థాయిలో సత్సంబంధాలు ఉన్న మెఘా కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..అవినీతికి ఆస్కారం లేకుండా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న సమయంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ సిద్దంగా ఉంది.
58 కోట్ల ఆదా ఆనందం ఆవిరి..
నాలుగు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వానికి పోలవరం 65వ ప్యాకేజి విషయంలో గతం కంటే 58 కోట్లకు తక్కువగా టెండర్ దాఖలు అవ్వటం..అందునా అది దాఖలు చేసిన సంస్థ చంద్రబాబు హాయంలో ఎక్కువ ధరకు పనులు దక్కించుకున్న సంస్థ. దీంతో..వైసీపీ ప్రభుత్వం తమ రివర్స్ టెండరింగ్ ఫలితం ఇది అంటూ చెప్పుకొచ్చింది. అయితే..పోలవరం ప్రధాన డ్యామ్ పనులతో పాటు...జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి జగన్ సర్కారు 4987 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ప్రభుత్వంలోని ముఖ్యులు అనేక సంస్థలతో దీని గురించి చర్చలు చేసారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పనులు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు.
దీంతో..ప్రీబిడ్ సమావేశానికి
మొత్తంగా ఎనిమిది కంపెనీలు హాజరయ్యాయి. కానీ..ఆ తరువాత అందులో ఏడు సంస్థలు పక్కకు తప్పుకున్నాయి. చివరకు మెఘా సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కొత్త సమస్యకు కారణమైంది. నిబంధనల ప్రకారం సింగ్ టెండర్ దాఖలైతే వారికి కాంట్రాక్టు ఖరారు చేయటం సాధ్య పడదు. అయితే.. తాము ఇచ్చిన సమయంలోగా బిడ్ దాఖలు చేసిన వారికే కాంట్రాక్టు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థకు కాకుండా.. మరో సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలంటే మరో సారి టెండర్లును పిలవాల్సి ఉంటుంది. అదే జరిగితే ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం అవ్వటం ఖాయమనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.
మెఘా పైన గతంలో వైసీపీ విమర్శలు..
కొద్ది రోజులుగా తమ అనుయాయులకు పనులు అప్పగించేందుకే వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ కు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇదే సమయంలో కొత్త వాదన తెర మీదకు తెస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి గురించి పదే పదే ప్రస్తావించేవారు. నాటి ప్రభుత్వం ఇదే మెఘా సంస్థకు వందల కోట్ల రూపాయాలు దోచిపెట్టిందని విమర్శలు చేసారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అదే పట్టిసీమ ద్వారా నీరును కూడా విడుదల చేసారు.
ఇక.. ఏపీలోనే కాకుండా
తెలంగాణలోని భారీ ప్రాజెక్టులు..దేశ వ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఘనత మెఘాకు ఉంది. అదే సమయంలో రాజకీయంగానూ ఆ సంస్థకు అనేక రకాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా తాము కోడ్ చేసిన ధరకు వచ్చిన సంస్థ చివరకు ఎవరు నిలిస్తే వారికి పనులు అప్పగించటంలో తప్పు లేదని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో నవయుగను తప్పించటం పైనా కోర్టులో విచారణ సాగుతోంది. ఇప్పుడు తక్కువ ధరలకే కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్న సమయంలోనే తాము నిర్ణయాలు తీసుకున్నామంటూ కోర్టుకు నివేదించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. తాము నిర్వహించిన రివర్స్ టెండింగ్ లో పాల్గొనే అవకాశం నవయుగ కు సైతం ఉందని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది.