మంత్రి కన్నబాబుకు అవమానం: మోదీ ఫొటోతో జగన్ ప్రభుత్వం ప్రచారం.. మారుతున్న సమీకరణాలు!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జగన్. నవరత్నాల్లో ప్రకటించిన పధకం వైయస్సార్ రైతు భరోసా. కానీ, అమల్లోకి వచ్చే సరికి విధి విధానాలు మారి పోయాయి. అదే సమయంలో పధకం పేరులో మరో పేరు జోడించారు. వైయస్సార్ రైతు భరోసా..పీఎం కిసాన్ పధకంగా పేరు ఖరారు. అయితే..ఈ పధకం పేరు మాత్రమే కాదు..ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రకటనల్లో వైయస్సార్ ఫొటోతో పాటుగా ప్రధాని మోదీ ఫోటో ఏపీ ప్రభుత్వ ప్రకటనలో హైలైట్ గా నిలిచింది. అయితే..కేంద్ర నిధులను సైతం ఇందులో వినియోగిస్తున్నారనే కారణంతో ప్రధాని ఫొటో చేర్చారు.
50 లక్షల మంది రైతులకు సీఎం జగన్ మేలు.. నెల్లూరు వేదికగా రైతు భరోసా
వైయస్సార్..సీఎం జగన ఫొటోలు ఓకే. మరి..ఈ పధకం పైన అనేక సమీక్షల్లో పాల్గొని..విధి విధనాలు ప్రకటిస్తూ..అధికారులకు సూచనలు చేస్తూ..వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్న కన్నబాబు పేరు మాత్రం ఈ ప్రచారంలో కనిపించ లేదు. కేవలం ఆయన పేరును మాత్రం ప్రకటనల కింద దర్శనమిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ పధకం వరకే మోదీ ఫొటో వినియోగిస్తున్నారా..లేక భవిష్యత్ అవసరాలకు..స్నేహాలకు ఇది నాందిగా నిలుస్తుందా..కొత్త సమీకరణాలకు ఇది సంకేతమా అనే చర్చ అటు ప్రభుత్వంలో..ఇటు రాజకీయ పార్టీల్లో మొదలైంది.
జగన్ ప్రభుత్వం..వైయస్సార్ తో పాటుగా మోదీ ఫొటో..
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోస పధకం పైన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చింది. పధకం అమలు వివరాలను అందులో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటుగా ఒక వైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ఫొటో కనిపిస్తోంది. మరో వైపు ప్రధాని ఫొటో దర్శనమిస్తోంది. అయితే.. ఈ పధకంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉండటంతో విమర్శలకు అవకాశం లేకుండా ప్రధాని ఫొటో ప్రచురించి..పధకంలో సైతం పీఎం కిసాన్ పేరును కూడా జత చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం..రాష్ట్రం రెండూ కలిసి రైతులకు ప్రయోజనం కల్పిస్తున్న సమయంలో రాజకీయంగా బేషజాలకు పోకుండా పరిణితితో వ్యవహరించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు సైతం దీని మీద ఇక విమర్శలు చేసే అవకాశం కోల్పోయారు. గతంలో చంద్రబాబు కంటే భిన్నంగా జగన్ వ్యవహరించటం..కేంద్ర పెద్దలను ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో ఏపీలో చర్చకు కారణమవుతోంది.
మంత్రి కన్నబాబు ఫొటో మిస్..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా పధకానికి సంబంధించి భారీ ఎత్తున ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. అందులో ప్రధాని ఫొటో..వైయస్సార్ ఫొటో..ముఖ్యమంత్రి జగన్ ఫొటో తో పాటుగా పధకం గురించి పూర్తిగా వివరించారు. అంత వరకూ ఓకే. కానీ, అసలు ఈ ప్రకటన వ్యవసాయ శాఖ పేరుతో సమాచార ప్రసార శాఖ విడుదల చేసింది. సహజంగా ఏ పధకానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చినా..ముఖ్యమంత్రి..అతిధులతో పాటుగా సంబంధిత మంత్రి పొటో ప్రచురించటం ఆనవాయితీ. అయితే, ఇప్పుడు మంత్రి ఫొటోకు స్పేస్ లేకుండా ఆ ప్రకటన డిజైన్ చేసారు. ప్రకటన కింద మాత్రం మంత్రి పేరు ప్రచురించారు. కేబినెట్ మంత్రిగా..సంబంధిత మంత్రిగా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వపోవటం ఆయనను అవమానించటమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒత్తిడి మేరకా..వ్యూహంలో భాగమా..
ఇప్పుడు రైతు భరోసా లో కేంద్ర నిధులు సైతం ఉండటంతో ప్రధాని ఫొటో.. పేరు జత చేసారు. దీని ద్వారా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీ ఆర్దిక పరిస్థితిని గుర్తించి..భవిష్యత్ లో మరింతగా కేంద్రం నుండి నిధులు దక్కించుకోవాలంటే ..వారితో విభేదాలు సరి కాదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాని పేరు చేర్చటం ద్వారా..రాష్ట్రంలో రాజకీయంగా వచ్చే నష్టం లేక పోగా..టీడీపీ మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గతంలో చంద్రబాబు వ్యవహరించన తీరు..ఇప్పుడు జగన్ తీరుకు తేడా గుర్తిస్తారని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాజకీయంగానూ బీజేపీ జాతీయ స్థాయిలో బలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పట్టు విడుపులతో వెళ్తూ..ఏపీకి కావాల్సినవి సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ వ్యూహాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలు లేక పోలేదు.