పంచాయతీలకు రంగులపై జగన్ మాస్టర్ ప్లాన్- ఒకేసారి విపక్షాలన్నీ గప్ చుప్...
ఏపీలో పంచాయతీ కార్యాలయాలపై రంగుల వ్యవహారం వైసీపీ ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో ఇరుకునపెట్టింది. దీంతో ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి ఓ సూపర్ ఐడియా తట్టింది. ఇప్పటికే 1400 కోట్లతో వైసీపీ రంగులు వేయించాలని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలను ఇరుకుపెడుతూ అతి తక్కువ ఖర్చుతో పని పూర్తయ్యేలా కొత్త వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
వైసీపీ రంగులతో ప్రభుత్వం అభాసుపాలు..
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వెలిశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన వంటి విపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదురైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇబ్బందుల్లో పడ్డ వైసీపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. చివరికి మళ్లీ అంతే ఖర్చుపెట్టి రంగులు మార్చక తప్పని పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ సర్కారు పన్నిన కొత్త వ్యూహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త రంగులను సూచించేందుకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ కొత్త ప్రతిపాదనను చేసినట్లు అర్ధమవుతోంది.
తెనాలిలో ప్రయోగాత్మకంగా..
రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయ భవనాలకు వైసీపీ రంగులు వేసేందుకు ప్రభుత్వం దాదాపు 1400 కోట్లు ఖర్చుపెట్టిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ అధికారులు మాత్రం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలకు మరోసారి కొత్త రంగులు వేయాలంటే మరో 1400 కోట్ల ఖర్చు తప్పదు. అసలే కరోనాతో కుదేలైన రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి. అంత ఖర్చు భరించే పరిస్దితి లేదు. అందుకే ఉన్న రంగులకు కాషాయం కూడా చేరిస్తే సరిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని హనుమాన్ పాలెంలో పంచాయతీ కార్యాలయానికి ప్రయోగాత్మంగా ఈ రంగులు వేశారు. ఈ వీడియోను టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
Recommended Video
ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలు..
పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ రంగులతో పాటు కాషాయాన్ని చేర్చడం ద్వారా ప్రభుత్వానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది మొత్తం రంగులు మార్చకుండా ఖర్చు కలిసి వస్తుంది. దీంతో పాటు అటు కేంద్రంలో తమతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్న బీజేపీ నేతలను సంతృప్తి పరిచినట్లవుతుంది. అదే సమయంలో బీజేపీ రంగులతో కూడిన పంచాయతీ కార్యాలయాల వ్యవహారాన్ని కెలికేందుకు అటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ ఇష్టపడవు. చివరికి హైకోర్టులో మరోసారి దీనిపై కేసులు వేసేందుకు ప్రత్యర్ధులకు అవకాశం లేకుండా పోతుంది. వెరసి ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులన్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుంది.