సొంత ఆదాయం లేక, కేంద్ర వాటా రాక- ఆర్ధిక సంక్షోభం అంచున ఏపీ..
అసలే విభజన తర్వాత రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రం. రెండున్నల లక్షల కోట్లకు పైగా అప్పు. నెల నెలా వచ్చే ఆదాయం వడ్డీలు, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకే సరిపోయే పరిస్ధితి. ఇంతలో వచ్చిన కరోనా వైరస్ లాక్ డౌన్ ఏపీకి శరాఘాతంగా మారింది. కొత్తగా అప్పు పుడుతుందో లేదో కూడా తెలియని పరిస్ధితుల్లో ఉన్న ఆదాయం కూడా తగ్గిపోవడంతో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభం అంచున నిలిచింది.
ఆర్ధిక సంక్షోభం అంచున ఏపీ...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఆదాయాలతో ప్రభుత్వం నడపగలమా లేదా అన్న సందిగ్ధతలోకి నెడుతోంది. మార్చినెల చివర్లో విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు లేక ఉద్యోగుల జీతాల్లో సగం కోత విధించిన ప్రభుత్వం.. ఏప్రిల్ లో ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
ఆదాయంలో అవే కీలకం..
ఏపీ ఆదాయంలో ప్రధాన పాత్ర భూముల రిజిస్ట్రేషన్లు, మద్యం, మైనింగ్ ఆదాయాలే. రిజిస్ట్రేషన్ల పరంగా నెలకు 400 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా 1500 కోట్లు సమకూరేవి. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ రెండూ పూర్తిగా నిలిచిపోయాయి. సగటున రోజుకు 160 కోట్ల ఆదాయం కలిగిన రాష్ట్రం ప్రస్తుతం లాక్ డౌన్ తర్వాత గత 16 రోజుల్లో కేవలం 76 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగిందంటే పరిస్దితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
తగ్గిన కేంద్ర వాటా, రుణాలే గతి..
కేంద్రం ద్వారా నెల వారీగా పన్నుల ఆదాయంలో వాటా, వారాంతంలో జీఎస్టీ ఆదాయం వాటా లభించేది. ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆదాయాలు పడిపోవడంతో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా తగ్గిపోయింది. జీఎస్టీ పరిస్దితి కూడా అంతే. దీంతో ప్రభుత్వానికి ఏకైక మార్గం అప్పులే అనే పరిస్ధితికి వచ్చేసింది. అయితే కేంద్రం నుంచి ప్రస్తుతం నెలకు 500 కోట్ల చొప్పున జీఎస్టీ పన్నుల వాటా లభిస్తోంది. ఇది ఏ మూలకూ సరిపోదు. దీంతో ఈ నెల 10 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
లాక్ డౌన్ కొనసాగితే..
ఇప్పటికే లాక్ డౌన్ విధించి నెల రోజులు దాటి పోయింది. మరో నెల రోజులు కొనసాగినా ఆశ్చర్యం లేదు. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దిగజారుతోంది. పరిశ్రమలు తెరిపించి పన్నులు రాబట్టుకుందామన్నా కుదరడం లేదు. దీంతో ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడం మినహా అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో లాక్ డౌన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎత్తేసేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటికే ప్రధానికి సైతం ఇదే విషయాన్ని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Recommended Video