ఇంగ్లీష్ మీడియంపై ఏం చేద్దాం ? ఏపీ సర్కార్ సమాలోచనలు- సమీపిస్తున్న గడువు..
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా జగన్ సర్కార్ ఏం చేయబోతోందన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తొలుత 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని భావించిన ప్రభుత్వం.. ఆ తర్వాత విమర్శల నేపథ్యంలో దాన్ని ఆరో తరగతికి పరిమితం చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీన్ని మరింత కుదించాలా లేక తల్లితండ్రులకే ప్రత్యామ్నాయాలు ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది.
ఇంగ్లీష్ మీడియంపై మల్లగుల్లాలు..
ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్దం చేస్తోంది. సుప్రీంకోర్టు వేసవి సెలవులు ప్రకటించే లోపే ఇంగ్లీష్ మీడియం వ్యవహారంపై తాడో పేడో తేల్చేయాలన్న పట్టుదల ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి నెలన్నర గడువు మాత్రమే మిగిలి ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైతే తప్ప విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యం కాకపోవచ్చని తెలుస్తోంది.
ప్రధాన అభ్యంతరం అదే..
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానంగా పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరం తల్లితండ్రులకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇవ్వకపోవడం. అంటే నిర్బంధ ఇంగ్లీష్ మీడియం అమలు. తల్లితండ్రులకు ఇంగ్లీష్ మీడియం అమల్లో ఆప్షన్ ఇస్తే అది చివరకు ప్రభుత్వ ఉద్దేశాన్నే దెబ్బతీయొచ్చనేది జగన్ సర్కారు అభిప్రాయం. అందుకే ఇంగ్లీష్ మీడియాన్ని నిర్బంధంగా అమలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇఫ్పుడు అదే అంశం హైకోర్టు తీర్పును ప్రభావితం చేసింది.
ఆప్షన్ పై ప్రభుత్వం రాజీ పడుతుందా ?
ఇంగ్లీష్ మీడియం ఎంచుకోవడంలో విద్యార్ధుల తల్లితండ్రులకు ఆప్షన్ ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం రాజీపడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై నిపుణుల సలహాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం కోసం ప్రత్యేక సెక్షన్లు పెట్టారు. ఆ తర్వాత వీటిని విస్తరించాలని భావించారు. కానీ అప్పట్లో దీన్ని వ్యతిరేకించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం పూర్తిస్దాయిలో ఇంగ్లీష్ మీడియానికి మొగ్గుచూపింది. తాజా పరిస్ధితుల నేపథ్యంలో తిరిగి తల్లితండ్రులకు ఆప్షన్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
Recommended Video
అదీ కుదరకపోతే...
విద్యార్ధుల తల్లితండ్రులకు ఇంగ్లీష్ మీడియం ఎంచుకునే అప్షన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశం దెబ్బతింటుందని భావిస్తే మాత్రం ప్రస్తుతం ఆరో తరగతి వరకూ ఇచ్చిన పరిమితిని ఎలిమెంటరీ స్కూళ్ల వరకూ పరిమితం చేసే అవకాశాలూ లేకపోలేదు. అలా చేసినా జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్న ఉద్దేశం నెరవేరదు. కాబట్టి దీనిపై ప్రతివాదులు సుప్రీంకోర్టులోనూ అడ్డుకునే అవకాశముంది. దీంతో రెండు, మూడు ఆప్షన్లు సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. వీటిపై క్లారిటీ వచ్చాక వెంటనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది.