చంద్రబాబు కీలక నిర్ణయం: రిజిస్ట్రేషన్లు బంద్, జూన్ 15 నుంచి ప్లాట్లు కేటాయింపు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. భూ సమీకరణ పథకం 9.18ఏ, 9.18బీ కింద ప్లాట్ల కేటాయింపునకు ఆప్షన్ కోరే గడువును ఈ నెల 25 తేదీ వరకు పెంచుతూ సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జపాన్కు చెందిన పుమిహికో మకీ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్ను పక్కన పెట్టకుండానే భారతీయ ఆర్కిటెక్ట్లతో సీడ్ కేపిటల్ భవనాలను రూపొందించాలని ఆయన సూచించారు.
భూ సమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు జూన్ 15 నుంచి ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ 34,481 ఎకరాలు భూ సమీకరణ ద్వారా సేకరించగా... రాజధానికి మరో 5517 ఎకరాలు అవసరమని తేల్చారు. దీనిని భూసేకరణ చట్టం ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు.
దీనిపై నోటిఫికేషన్ జారీ చేసి... నవంబరు 30వ తేదీలోపు సేకరణను పూర్తి చేయనున్నారు. కాగా, భూసమీకరణలో భూములు ఇచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు నేలపాడు నుంచి ప్రారంభించాలని ఆయన సూచించారు. ప్లాట్ల కేటాయింపుపై గ్రామాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు.
దీనికి సంబంధించి జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రికి సీఆర్డీఏ అధికారులు చెప్పారు. మొత్తం ప్లాట్ల కేటాయింపును నవంబర్ 23 నాటికి పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్లాట్ల కేటాయింపు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పూర్తిచేసే వరకు ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే మెట్ట రైతులకు కోసం 50 చదరపు గజాల వాణిజ్య ప్లాటు అదనంగా ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. కోర్ క్యాపిటల్లో కూడా ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్)ను అమలు చేస్తున్నట్లు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించారు.
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పది కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ సరిహద్దుల్లో ఉన్న 7781 ఎకరాల అటవీ భూమిని కూడా సీఆర్డీఏలో కలపాలని చంద్రబాబు ఆదేశించారు. డీ నోటిఫై తర్వాత అందులో నిర్మాణాలు చేపట్టనున్నారు.