జగన్ సర్కార్ వెనకడుగు: హైకోర్టు మెట్లెక్కనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?: తెలుపుతో సరి
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టకేలకు రంగుల వివాదానికి తెర దించినట్టే కనిపిస్తోంది. గ్రామ సచివాలయం సహా గ్రామీణ స్థాయిలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రభుత్వ భవనాలన్నింటికీ ఎంపిక చేసిన రంగులు వ్యవహారంలో ప్రభుత్వం వెనకడుగు వేయడానికి సిద్ధపడింది. ప్రభుత్వ భవనాలన్నింటికీ తెలుపు రంగులను వేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ సహా కొందరు అధికారులు హైకోర్టుకు హాజరు కావచ్చని సమాచారం.
వైజాగ్ నాట్ ఫర్ సేల్: భూముల అమ్మకానికి నిరసనగా ఉద్యమిస్తోన్న విశాఖ: టీటీడీపై వెనక్కి తగ్గడంతో
తొలుత పార్టీ రంగులు.. అనంతరం జాతీయత ప్రతిబింబించేలా
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, పంచాయతీ రాజ్ కార్యాలయాలకు పార్టీ రంగులను వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది కాస్తా దుమారానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఎలా పూస్తారంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. మే 28వ తేదీ నాటికి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియబోతుండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాస్సేపట్లో హైకోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెలుపు రంగు వేయడానికి
గ్రామ సచివాలయాలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తెలుపురంగును వేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండా రంగులను తొలగించిన తరువాత.. జాతీయ భావాలను ప్రతిబింబించేలా ఆకుపచ్చ, నీలం, టెర్రాకోట, తెలుపు రంగుల మిశ్రమాన్ని వేసింది. వాటిని కూడా తొలగించడానికి ప్రభుత్వం అంగీకరించినందని అంటున్నారు. ఈ విషయాన్ని హైకోర్టుకు స్పష్టం చేయడానికి నీలం సాహ్నీ సహా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి, ఒకరిద్దరు ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరవుతారని చెబుతున్నారు.
టెర్రాకోట, ఆకుపచ్చ, నీలం, తెలుపు..
రాష్ట్రంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల భవనాలకు కొత్తగా టెర్రాకోట, ఆకుపచ్చ నీలం, తెలుపు రంగులను వేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. దీనిపై రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ రెండింటినీ ఏప్రిల్ 23వ తేదీన నీలం సాహ్నీ జారీ చేశారు. గ్రామ పంచాయతీల కార్యాలయాలకు రంగులు వేసే విషయంలో ఇదివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆమె విడుదల చేశారు.
ఒక్కో రంగునకు ఒక్కో అర్థం వచ్చేలా..
ఒక్కో రంగునకు ఒక్కో అర్థాన్ని ఇచ్చింది ప్రభుత్వం. భూమిని, మట్టిని ప్రతిబింబించేలా టెర్రా కోట రంగును ఎంపిక చేశారు. పచ్చని పంట పొలాలకు నిదర్శనంగా, హరిత విప్లవాన్ని గుర్తుకు తీసుకొచ్చేలా ఆకుపచ్చ రంగును వేయనున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాలు, ప్రాజెక్టులను ఉద్దేశించి నీలం రంగును ఎంచుకున్నారు. పాలు, పాడి పరిశ్రమాభివృద్ధికి సూచికగా, శ్వేత విప్లవానికి సంకేతంగా తెలుపు రంగును ఎంపిక చేశారు. అవేకాకుండా- స్థానికతను ప్రతిఫలించేలా ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాలు గానీ, ఇతర పర్యాటక ప్రాంతాలను గానీ గుర్తుకు తెచ్చేలా థీమ్ను రూపొందించుకునే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం.
Recommended Video
సుప్రీంకోర్టుకు వెళ్లినా..
వాటిని కూడా హైకోర్టు అంగీకరించ లేదు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంది. హైకోర్టు మాత్రం రంగుల వ్యవహారంపై అసంతృప్తిని, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వాటిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఆయా రంగుల స్థానంలో తెలుపును వేయడానికి సిద్ధపడింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు స్పష్టం చేయనుంది. లేదా హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వేరే రంగులను వేయవచ్చనీ అంటున్నారు.