గురుకుల పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలు: ప్రతి నియోజకవర్గంలో వంద పడకలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొనడానికి జగన్ సర్కార్ విస్తృత చర్యలను చేపట్టింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ.. దాని ప్రభావాన్ని, వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. కరోనా వైరస్ అనుమానితులకు వైద్య సహాయాన్ని అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పుతోంది
వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం.: మూడు నెలల వేతనం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు కేటాయింపు..
ప్రతి నియోజకవర్గంలో 100, జిల్లా కేంద్రంలో 200 పడకలు..
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని వస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వంద పడకల సామర్థ్యంతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో ప్రత్యేక ఐసొలేషన్ సెంటర్లను నెలకొల్పబోతోంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టుగా భావిస్తోన్న కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పింది.
గురుకుల పాఠశాల భవనాల్లో..
నియోజకవర్గం స్థాయిలో వంద పడకల సామర్థ్యంతో కూడిన ఐసొలేషన్ కేంద్రాన్ని నెలకొల్పాలంటే మాటలు కాదు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భవనాల కొరత ఏర్పడుతోంది. నియోజకవర్గాల స్థాయిలో వంద పడకలను ఏర్పాటు చేయడానికి అనువైన భవనాలు అందుబాటులో లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గురుకుల పాఠశాలల, ఇంజినీరింగ్ కళాశాలల భవన సముదాయాల్లో ఈ ఐసొలేషన్ సెంటర్లను నెలకొల్పుతోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు-భవనాల శాఖకు చెందిన అతిథిగృహాల్లో వాటిని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
విశాఖలో విస్తృతంగా..
విశాఖపట్నంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నగరంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి వంటి కొన్ని జిల్లాలో ఐసొలేషన్, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే మొత్తం 2,382 పడకలతో వాటిని నెలకొల్పారు. విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రులు, కళాశాలలను పరిశీలించి కేంద్రాలను దీనికోసం ఎంపిక చేశారు.
విశాఖలో ఏర్పాటు చేసిన కేంద్రాలివే..
విశాఖ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో 400 పడకలు, ఆంధ్రా యూనివర్శిటీ హాస్టల్లో 200 పడకలు, ప్రభుత్వ మానసిక వైద్య ఆసుపత్రి-90, గాయత్రీ విద్యా పరిషత్-90, కంటి ఆసుపత్రి-50, రుషికొండ గీతం వైద్య కళాశాల- 364, గీతం ఆసుపత్రి- 200, గీతం ఇంజనీరింగ్ కళాశాల- 748 పడకలతో వాటిని నెలకొల్పారు. అరకు, పాడేరు వంటి ఏజెన్సీ పట్టణాల్లో సైతం ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం.