సీఎం జగన్ సంచలన నిర్ణయం.. దేవాలయ పదవుల్లోనూ రిజర్వేషన్లు..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయంగా ఇచ్చే పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో చట్టం చేసిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలక మండళ్లు..ట్రస్టు బోర్డుల్లోనూ సాధారణ పోస్టుల భర్తీ తరహాలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రభుత్వ నామినేట్ చేసే దేవాలయాల పాలక మండళ్లల్లో ఎస్సీ..ఎస్టీ..బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇదే సమయంలో ఆ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అయితే, తాజాగా తిరుమలి తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కోసం ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది.
దీంతో..మరి కొంత మందికి అవకాశం కల్పించేందుకు గతంలో ఉన్న టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుండి ఇప్పుడు 29కు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసారు. ఇప్పుడు టీటీడీ బోర్డు పదవుల్లోనూ ఈ రిజర్వేన్లను అమలు చేస్తారా అనే చర్చ మొదలైంది. గతంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల అంశం టీటీడీకి వర్తించదని స్పష్టం చేసారు. ఇక..ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయటం..ఇప్పుడు ఈ జీవో జారీ చేయటం ద్వారా టీటీడీ బోర్డులో రిజర్వేషన్లు అమలు చేయటానికేనా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇతర దేవాలయాల పాలక మండళ్లు..ట్రస్టుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
మంత్రి మండలి కూర్పులో ఊహించని విధంగా అయిదుగురికి డిప్యూ సీఎంలు.. అందునా సామాజిక వర్గాల వారీగా ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన ముఖ్యమంత్రి జగన్..పదవుల పందేరంలోనే రిజర్వేషన్ల అమలు పైన అసెంబ్లీలో చట్టం చేసారు. ఇప్పుడు ప్రభుత్వ పదవులతో పాటుగా దేవాలయాల్లోనూ రిజర్వేషన్ల అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏపీలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మంత్రులు..ఎమ్మెల్యేల నుండి దీని కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు పైగా సమయం గడవటంతో ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లు పూర్తి చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా తొలుత ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు ఏర్పాటుతో మొదలు పెడుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ జీవో ద్వారా ముఖ్యమంత్రి తీసుకున్నది సంచలన నిర్ణయమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.