సీఎం జగన్ సంచలన నిర్ణయం: పోలవరం నుండి నవయుగ ఔట్: టీడీపీకి భారీ షాక్ ..నెక్స్ట్ టార్గెట్..
ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును 60సి కింద దక్కించుకొని పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణం చేస్తున్న నవయుగ సంస్థకు పనుల నుంది తప్పుకోవాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో పాటుగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుండి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయించారు. 2018లో దాదాపు మూడు వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం అప్పగించింది. అదే విధంగా రూ. 3220 కోట్ల విలువైన ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం నవయుగకు కట్టబెట్టింది. అయితే, టీడీపీలోకి ముఖ్యులకు నవయుగతో ప్రత్యక్ష..పరోక్ష సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటుగా అవినీతి జరిగిందని కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం కారణంగా ప్రాజెక్టు పైన ఎటువంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది.
Recommended Video
పోలవరం నుండి నవయుగ ఔట్..
ఊహించిందే జరిగింది. పోలవరం ప్రాజెక్టు కేటాయింపుల పైన జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం పైన రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని కమిటీ ప్రభుత్వానికి సూచన చేసింది. ఇదే సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా 60సీ కింద నవయుగకు పనులు అప్పగించారని..అదే సమయంలో మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా నవయుగకు అప్పగించారని నిపుణుల కమిటీ పేర్కొంది. దీంతో.. పోలవరం పనుల మీద రీ టెండరింగ్కు వెళ్లాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం లోని జలవనరుల శాఖ నేరుగా నవయుగ సంస్థకు నోటీసులు ప్రీ క్లోజర్ నోటీసులు జారీ చేసింది. నాటి ప్రభుత్వం ఈపీసీ విధానంలో భాగంగా నవయుగకు పనులు అప్పగించామని.. నాటి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, తాజా గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నవయుగ గతంలో 14 శాతం తక్కువకే పనులు అప్పగించామని చెబుతున్న వేళ ..కొత్త కాంట్రాక్టర్లు ఏ ధరకు పనులు చేసేందుకు ముందుకు వస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
3600 కోట్లు అదనంగా ఇచ్చారనే ఆరోపణలు..
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టను ఎంపి రాయపాటి సాంబశివరావుకు చెంది న ట్రాన్స్ట్రాయ్కు కేటాయించారు. అయితే, ఆ సంస్థ ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది పనులు నిర్వహణలో ముందుకు వెళ్ల లేదు. దాదాపు పనులు ఆగిపోయే పరిస్థితుల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ట్రాన్స్ట్రాయ్కు పనులు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు రద్దు చేసి..కొత్తగా టెండర్లు పిలవటానికి కేంద్ర జల వనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఈపీసీ విధానంలో భాగంగా నవయుగకు పాత ధరలకే పని చేసేందుకు 60సి నిబంధన మేరకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మరి కొన్ని సబ్ కాంట్రాక్టు సంస్థలు సైతం ప్రస్తుతం పనులు కొనసాగిస్తోంది. అయితే, తాజాగా జగన్ అధికారంలోకి వచ్చిన తరు వాత పోలవరంలో అవినీతి జరిగిందనే కారనంతో నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ పోలవరంలో దాదాపు రూ.3600 కోట్ల మేర అదనపు చెల్లింపులు జరిగాయని నివేదిక ఇచ్చింది.
జగన్ నిర్ణయంతో..టీడీపికి షాక్..
ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో..రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. పాత ధరలకే నవయుగ పని చేస్తున్న సమయంలో..రివర్స్ టెండరింగ్కు వెళ్తే నిజంగా ఆ ధరలకే పని చేసేందుకు కొత్త సంస్థలు ముందుకు వస్తాయా అనేది ఆసక్తి కరంగా మారింది. టీడీపీ ప్రభుత్వంలో నవయుగ సంస్థకు ప్రాధాన్యత లభించింది. ఇప్పుడు నవయుగ సంస్థకు ఆర్దికంగా నష్టం కలిగే నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఇప్పుడు నవయుగ సంస్థ దీని పైన ప్రభుత్వం మీద న్యాయ పోరాటానికి దిగుతుందా.. లేక పనుల నుండి నోటీసుల మేరకే తప్పుకుంటుందా అనేది మరో ఆసక్తి కర అంశం. అయితే, ఇదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విధంగా పోలవరం కోసం రివర్స్ టెండరింగ్కు వెళ్తే తక్కువ ధరలకు ఎవరు వస్తారు.. పనులు ఎవరు కొనసాగిస్తారు.. ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కర చర్చకు కారణమైంది.