నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు: ఏపీ ప్రభుత్వ ఘననివాళి
దాదాపు అన్ని భాషల్లో వేల గీతాలను ఆలపించి ముఖ్యంగా తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఘనమైన నివాళి అర్పించింది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన బాలసుబ్రమణ్యం జ్ఞాపకంగా నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టి ఆయన కీర్తిని చాటి చెప్పే ప్రయత్నం చేసింది.
నెల్లూరులో సంగీత పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టిన ఏపీ సర్కార్
ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరు లోనే పుట్టి పెరిగారు. ఆయనకు ఆయన పుట్టిపెరిగిన ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ. ఆయన తల్లిదండ్రులు నెల్లూరులో జీవించారు. బాలు తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ జ్ఞాపకంగా ఆయన నెల్లూరులోని తన సొంత ఇంటిని వేద పాఠశాల ఏర్పాటుకు ఇచ్చారు. తెలుగు సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగిన స్వర సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గుర్తుగా ఏపీ ప్రభుత్వం నెల్లూరులో సంగీత పాఠశాలకు ఆయన పేరు పెట్టి, తెలుగు వారి గుండెల్లో పదిలంగా బాలు ఉంటారని చెప్పింది.
ఉత్తర్వులు జారీ.. మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ .. చరణ్ హర్షం
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు చరణ్ స్పందించారు. తన తండ్రి పేరును నెల్లూరు ప్రభుత్వ మ్యూజిక్ పాఠశాలకు పెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన తండ్రికి ఇచ్చిన గౌరవం పై కృతజ్ఞతలు తెలియజేశారు ఎస్ పి చరణ్.
స్వర సామ్రాట్ కు ఏపీ సర్కార్ ఘనమైన నివాళి
స్వర సామ్రాట్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేల పాటల్లో ఆయన నిలిచే ఉంటారు. పాటలు పాడే ప్రతి ఒక్కరి నాలుకలపై ఆయన పాటలే పలుకుతాయి . సంగీతం నేర్చుకునే ప్రతి ఒక్క విద్యార్థి మనసులో ఆయన ఒక ప్రేరణగా ఉంటారు. ప్రతి సంగీత పాఠశాల లో వినిపించే స్వరాలలో గాన గంధర్వుడు చిరంజీవిగా జీవించే ఉంటాడు. స్వర సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కి నివాళిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.