జగన్ ఒక్కసారిగా కమిట్ అయితే..: ఎవరు ఏం చెప్పినా బేఖాతర్..పోలవరానికి రివర్స్ టెండర్ జారీ...!!
ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదే చేసారు. తాను ఒక్కసారి డిసైడ్ అయితే..వెనకడుగు వేసేదే లేదని తేల్చేసారు. అమెరికా పర్యటనలో ఉన్నా..తమ నిర్ణయాల పైన విమర్శలు వెల్లువెత్తుతున్నా.. మరో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. పునరాలోచన చేయాలని స్వయంగా పీపీఏ ఛైర్మన్ స్వయంగా లేఖ రాసినా పట్టించుకోలేదు. కేంద్ర నిర్ణయం వరకు వేచి చూడాలని కోరినా ససేమిరా అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం జగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీంతో..ముందునుండి చెబుతున్నట్లుగానే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఎలా సమర్ధించుకుంటుందీ.. కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందీ..మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ఎటువంటి ప్రభావం పడుతుందనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి.
పోలవరం రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ..
ప్రభుత్వం పట్టు వీడలేదు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెనుకడుగు వేసేదీ లేదని తేల్చేసింది. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా..తాము నిర్ణయించిన దారిలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రివర్స్ టెండరింగ్ నోటీఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని..అనుకూల కాంట్రాక్టర్లకు దొడ్డి మార్గంలో దోచిపెట్టిందనేది వైసీపీ వాదన. దీంతో..వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ నిర్ణయించారు. మరో నెల రోజుల తరువాత పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాల్సి ఉండటంతో ముందుగానే పనులు కొనసాగిస్తున్న నవయుగ సంస్థను తప్పించారు. రివర్స్ టెండరింగ్ మీద పోలవరం ప్రాజెక్టు అధారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయకుండా నోటీఫికేషన్ విడుదల చేసింది. చేసింది. రూ. 4,900 కోట్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ను జలవనరుల శాఖ వెబ్సైట్లో పెట్టింది. హెడ్ వర్క్లో మిగిలిపోయిన పనులకు రూ. 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ. 3,100 కోట్లకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. 2015-16 ఎస్ ఎస్ ఆర్ ధరల ప్రకారం టెండర్ జారీ చేసారు.
పీపీఏ అబ్యంతరాలు బేఖాతర్...
పోలవరం ప్రాజెక్టు పనులను తొలి నుండి పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అధారిటీ ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రివర్స్ టెండరింగ్ విషయంలో తొందర వద్దని..కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తవ్వాలంటే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వద్దని సూచిస్తూ అథారిటీ) సీఈవో ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న కాంట్రాక్టులు, మిగిలి ఉన్న పనులకు రీటెండరింగ్ తదితర విషయాలపై ఆగస్టు 13న పీపీఏ నిర్వహించిన అత్యవసర సమావేశం నాటి అంశాలను ఈ లేఖలో ప్రస్తావిస్తూ ఏపీ రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య అధికారి ఆదిత్యనాథ్ దాస్కు పీపీఏ సీఈఓ ఆర్కే జైన్ లేఖ రాయడం ఉత్కంఠగా మారింది. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండర్ల ప్రక్రియను ఒకట్రెండు రోజుల్లో మొదలు పెడతామని, 2015-16 రేట్ల ప్రకారం టెండర్లను పిలుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. పంతం నెగ్గించుకునేందుకు అన్నట్లు.. పోలవరం అథారిటీ లేఖను పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ను విడుదల చేశారు.
జగన్ తన నిర్ణయం కోసం..తొలి నుండి
ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి రివర్స్ టెండరింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు బిల్లును ఆమోదించారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్ణీత గడువు లోగా కాంట్రాక్టర్లు తమ టెండర్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని పైన జ్యుడిషియల్ కమిషన్ అందరి అభ్యంతరాలను..సూచనలను పరిగణలోకి తీసుకొని తక్కువ టెండర్ కోట్ చేసిన వారికి ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పగించనుంది. అయితే, ఇప్పటికే ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగను ప్రభుత్వం తప్పించింది. నవయుగ సైతం రివర్స్ టెండరింగ్ లో పాల్గొన వచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మీద ప్రభావం లేకుండా 2021 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా న్యాయ పరమైన చిక్కులు తలెత్తి..ప్రాజెక్టు మీద ప్రభావం చూపే అవకాశం ఉందనే అందోళన సూతం వ్యకత్ం అవుతోంది. ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయాయని..తక్కువ ధరకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామనే ధీమా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నా.. 2015-16 ధరలకు ఇప్పుడు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా అనేదే అసలు చర్చ. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం ఉంది.