డేటా చోరీ కేసులో కొత్త ట్విస్టు ... జగన్ మీడియాకు నోటీసులు
అమరావతి: ఎన్నికల ముందు జగన్ మీడియాకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితం జగన్ సొంత మీడియాలో ఓ కథనం ప్రసారమైంది. అందులో డేటా చోరీ అంశానికి సంబంధించి కథనం ప్రసారమైంది. "పార్టీ కోసం ప్రభుత్వం సేవ- ముఖ్యమంత్రి ఆదేశాలతోనే"అనే శీర్షికతో కథనం ప్రసారమైంది. ఇందులో డేటా చోరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంలో ఆర్టీజీఎస్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై కథనం టెలికాస్ట్ చేయడంతో పాటు సాక్షి పత్రికలో కూడా కథనం ప్రచురితం అయ్యింది. అయితే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గాను సాక్షి పత్రిక, సాక్షి ఛానెల్పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని అహ్మద్ బాబు కోరారు.
అహ్మద్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించింది. అన్ని విషయాలు పరిశీలించిన ప్రభుత్వం సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాన్ని కుదిపేసిన డేటీ చోరీ అంశంలో రాష్ట్రంలోని పౌరుల సమాచారం ఓ మొబైల్ యాప్ ద్వారా ఓ రాజకీయ పార్టీకి చేరవేశారని చెబుతూ అహ్మద్ బాబు ఉన్న ఫోటోలను వీడియోలను సాక్షి ఛానెల్, మరియు దినపత్రికలో మార్చి 11, 2019న కథనం ప్రసారమైందని... ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు బాబు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అహ్మద్ బాబు సమాచారంను లీక్ చేశారంటూ కథనంలో పేర్కొంది.
ఇక దీనిపై కోర్టులో కేసును ఫైల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రభుత్వం ఆదేశించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జగతి పబ్లీకేషన్ లిమిటెడ్కు లీగల్ నోటీసులు పంపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సాక్షి ఛానెల్, మరియు సాక్షి దినపత్రికకు సంబంధించిన ఎడిటర్కు నోటీసులు పంపుతూ జీవో జారీ చేశారు ఛీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత.