ఏపీలో లాక్ డౌన్ సడలింపుకు కొత్త మార్గదర్శకాల విడుదల- ఇక వీటికీ అనుమతులు...
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు కోసం ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన తాజా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాల ఆధారంగా ఈ అదనపు మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో హోంమంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం వీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఏపీలో తాజాగా లాక్ డౌన్ మినహాయింపుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన అదనపు మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం, హార్టికల్చర్ రంగాల పనులకు మినహాయింపు ఇవ్వనున్నారు. అలాగే మొక్కల పెంపకం, వీటి కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇస్తారు. అలాగే ఆర్దిక రంగానికి కూడా మినహాయింపులు ఇవ్వబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం, కేబుల్స్ పనులకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయనున్నారు. ఈ కామర్స్ సంస్ధలు వాడే వాహనాలకు రోడ్లపై తిరగేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే వలస కార్మికులు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
అయితే వీరందరికీ కరోనా లక్షణాలు లేకపోతేనే ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి ఇవ్వనున్నారు. అన్ని పుస్తకాల షాపులకూ, ఎలక్ట్రిక్ ఫ్యాన్ షాపులకూ మినహాయింపులు ఇస్తారు. అలాగే ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు చేయనున్నారు. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకూ అనుమతి ఇవ్వనున్నారు.